టీడీపీ ప్లాన్ సక్సెస్ అయితే రాజకీయాలు మారిపోతాయా?

టిడిపిలో భారీ జోష్ కనిపించింది. ముఖ్యంగా 33% సీట్లను, పదవులను మహిళలకు కేటాయిస్తామని పార్టీ అధినేత అదేవిధంగా సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనతో పాటు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ చేసిన ప్రకటన భారీగా చర్చకు దారి తీసింది. వాస్తవానికి 33% రిజర్వేషన్ అనేది జాతీయ స్థాయిలో ఒక వైపు చర్చ నడుస్తోంది. పార్లమెంట్లో ఇటీవల బిల్లు ప్రవేశపెట్టి కూడా వెనక్కి తీసుకునే పరిస్థితి వచ్చింది. అయితే దీనిని తాను కచ్చితంగా అమలు చేస్తామంటూ లోకేష్ చేసిన ప్రకటన అదే విధంగా చంద్రబాబు చేసిన ప్రకటన కూడా ఇటు పార్టీలోనూ అటు రాజకీయ వర్గాలను ఆసక్తిగా మారింది.

నిజానికి ఇప్పుడున్న 175 నియోజకవర్గాల్లో 33% అంటే దాదాపుగా 50 సీట్లు మహిళలకు కేటాయించాల్సి వస్తుంది. ఈ స్థాయిలో మహిళలు అసెంబ్లీకి వెళితే కచ్చితంగా అది టిడిపి సాధించిన ఘన విజయం అనే చెప్పాలి. కానీ, ఈ పరిస్థితి ఉంటుందా అనేది కీలకమైన అంశం. వాస్తవానికి గత ఎన్నికల్లో కూడా టిడిపి పైకి రిజర్వేషన్ అని చెప్పకపోయినప్పటికీ చాలామంది మహిళా నాయకులకు అవకాశం కల్పించింది. దాదాపు 18 శాతం వరకు సీట్లు ఇచ్చారని అప్పట్లో చర్చ నడిచింది. ఇక, ఇప్పుడు 33% సీట్లను మహిళల కేటాయిస్తామని చంద్రబాబు చెబుతున్నారు.

తద్వారా అసెంబ్లీలోను అదేవిధంగా పార్లమెంట్లోనూ మహిళా నాయకత్వానికి టిడిపి బలమైన వేదికగా మారుతుంది అన్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి పంపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళా ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది. పురుషులతో పోల్చుకుంటే ప్రస్తుతం 20 లక్షల మంది మహిళలు అధికంగా ఉన్నారు. వీరందరికీ ఓటు హక్కు ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుంటే వచ్చే 2029 ఎన్నికల నాటికి దాదాపు మహిళల సంఖ్య అంటే పురుషులతో పోల్చుకుంటే మహిళా ఓటర్ల సంఖ్య సుమారు 50 లక్షలు దాకా పెరుగుతుందన్న అంచనా ఉంది.

మహిళలను మచ్చిక‌ చేసుకునేందుకు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. తద్వారా 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న టిడిపి ఆలోచన ప్రస్తుత రాజకీయాలకు సరైన నిర్ణయంగా ఉందన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. మెజారిటీ నియోజకవర్గాల్లో మహిళా నాయకులైతే ఉన్నారు. అలాగని వారికే టికెట్లు ఇస్తే మరి మిగిలిన నాయకుల పరిస్థితి ఏమిటి అనేది ఒక ప్రశ్న వస్తుంది. పోనీ.. పార్లమెంటు ఈ ద‌ఫా ఖచ్చితంగా మహిళా బిల్లును ఆమోదిస్తుందా పార్లమెంట్ నియోజకవర్గాల పున‌ర్విభజన జరుగుతుందా అంటే అది పెద్ద సందేహంగానే మారింది.

ఇది రాజ్యాంగపరమైన విషయం కావడంతో ఇటు లోక్సభలోను అటు రాజ్యసభలోను బలమైన అభ్యర్థుల మెజారిటీ కావాలి. దీనిని సాధించలేకపోవడం వల్లే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ రెండు విషయాలను వెనక్కి తీసుకుంది. ఒకవేళ 33% రిజర్వేషన్ కేంద్రం వైపు నుంచి రాకపోయినప్పటికీ లోక‌ల్‌గా ఇస్తామ‌ని ప్రకటించారు. దీంతో అవకాశాలు తగ్గిపోయే నాయకుల పరిస్థితి కూడా పార్టీ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో గెలుపు గుర్రాలుగా ఎంపిక చేసే మహిళలకు వారసత్వ వాసనలే ఉంటాయా లేకపోతే వారిలోంచి నిబద్ధులైన నాయకులను తీసుకుంటారా అనేది ప్ర‌శ్న‌.

సామాన్య మహిళలకు అవకాశాలు కల్పిస్తారా అనేది ఇప్పుడు పార్టీ ముందు ఉన్న ప్రధాన ప్రశ్న. వీటికి కూడా పార్టీ అధిష్టానం సరైన సమాధానం చెప్పగలిగితే 33% రిజర్వేషన్ భారీ ఊపుని తీసుకువస్తుంద‌న‌డంలో సందేశం లేదు.