ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు టీడీపీ మహానాడు కార్యక్రమం మంగళగిరిలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది హైబ్రిడ్ విధానంలో మహానాడు జరుగుతోంది. ఈ క్రమంలోనే తొలి రోజు మహానాడులో ప్రారంభోపన్యాసం చేసిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది వాహనాల హోరు తగ్గిందని…కానీ, టీడీపీ కార్యకర్తల్లో జోష్ తగ్గలేదని చంద్రబాబు అన్నారు. అయితే, మహానాడు నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేసేందుకు వైసీపీ ఏదో ప్రెస్ మీట్ పెట్టిందని విమర్శించారు.
గొడ్డలి పార్టీని అడ్డుకోవాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిపై గొడ్డలి వేటు వేసిన వైసీపీ వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలన్నారు. పేదలకు కావాల్సింది సంక్షేమ పథకాలు అని.. గొడ్డలి వేట్లు కాదని… యువతకు కావాల్సింది ఉద్యోగాలని… గొడ్డలి పోట్లు కాదని అన్నారు. రాష్ట్రానికి కావాల్సింది శాంతి భద్రతలని.. జంతు బలులు కాదని చెప్పారు. రక్త చరిత్ర రాసేవారు.. స్వర్ణాంధ్ర చరిత్రను లిఖించలేరని తెలిపారు. అందుకే గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అంటూ సరికొత్త నినాదంతో చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లారు.
అంతేకాదు, పార్ట్ టైం పాలిటిక్స్ వద్దని చంద్రబాబు హితవు పలికారు. అహంకారం, ఇగోలకు పోవద్దని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజాసంబంధాలే ముఖ్యమని, అవే మనకు శ్రీరామరక్ష అని అన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్త…ప్రజలతో మమేకం కావాలని చెప్పారు. స్వర్ణాంధ్ర 2047..హెల్తీ వెల్తీ హ్యాపీ ఏపీ మన లక్ష్యం అని చంద్రబాబు టీడీపీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates