బలమైన మూడు నియోజకవర్గాలలో వైసీపీ జెండా ఎగరడం లేదా? అసలు ఆరెండు స్థానాలను కీలకంగా తీసుకుని వైసీపీ చేసిన ప్రయత్నాలు, ప్రయోగాలు ఫలించడం లేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఆ మూడు నియోజకవర్గాలు గెలిస్తే.. చాలా పెద్ద ఎత్తున విజయం దక్కించుకున్నట్టేనన్న అభిప్రాయం పార్టీవర్గాల్లో ఉండేది. కానీ, గత ఎన్నికల్లో ఆ మూడు చోట్లా పరాజయం పాలయ్యారు. పోనీ.. ఇప్పుడైనాపట్టు బిగించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారా? అంటే.. లేదనే సమాధానమే వినిపిస్తోంది.
1) కుప్పం: సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. ఇక్కడ వైసీపీ పెద్ద ఎత్తున అధికారంలో ఉన్నప్పుడు.. గెలుపు గుర్రం ఎక్కేందుకు ప్రయత్నించింది. ప్రత్యర్థి నాయకుడి నియోజకవర్గమే అయినా.. వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఏనియోజకవర్గంలోనూ జరగని అభివృద్ధి చేశారు. ఏకంగా ఎంపీ, మంత్రులు ఇక్కడే తిష్ఠ వేసి.. అప్పట్లో రాజకీయాలు చేశారు. కానీ, పలితం దక్కలేదు. పైగా.. గత ఎన్నికల్లో ఓడిపోయిన భరత్.. ఇప్పటి వరకు అజా లేకుండా పోయారు. ప్రస్తుతం ఇక్కడ జెండా కట్టేవారే కరువయ్యారు.
2) మంగళగిరి: ఇది కూడా వైసీపీకి అత్యంత కీలకమైన నియోజకవర్గం. మంత్రినారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఆయనను ఓడించాలని 2024 ఎన్నికల్లో చేయని ప్రయత్నం, ప్రయోగం లేదు. కానీ, నారా నందమూరి ఫ్యామిలీలు..ఇక్కడ పెద్ద ఎత్తున ఇంటింటికీ తిరగడం, వైసీపీలో పుట్టిన ముసలం కారణంగా.. పార్టీ వోడిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే.. వైసీపీలో ఉన్న మాజీ మంత్రి ఒకరు టీడీపీకి అనుకూలంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన నాయకురాలు కూడా కనిపించడం లేదు.
3) పిఠాపురం: జనసేన అధినేత డిప్యూటీ సీఎంపవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇక్కడ కూడా.. విజయం సాధించి.. పవన్ను మరోసారి ఓడించాలని గత ఎన్నికల సమయంలో వైసీపీ చేసిన ప్రయత్నాలు .. విఫలమయ్యాయి. వంగా గీతావిశ్వనాథ్ను తీసుకువచ్చి.. ఇక్కడ నిలబెట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రస్తుతం ఇక్కడ కూడా.. వైసీపీ జాడలు కనిపించడం లేదు. గత ఎన్నికల సమయంలో పార్టీలో ఉన్న కీలక నేత.. దొరబాబు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దీంతో వైసీపీ తరఫున వాయిస్ వినిపించేవారు.. కనిపించేవారు కూడా కరువయ్యారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates