‘గొడ్డలి పార్టీ’ వ్యాఖ్యలకు జగన్ ఇంతలా ట్రిగ్గర్ అయ్యారా?

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం తాడేపల్లిలోని తన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జగన్ తన పాత పాటను పాడినట్టే అన్నీ పాత విషయాలే చెప్పుకొచ్చారు. అయితే కొత్తగా కొన్ని అంశాలను ఆయన ప్రస్తావించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. గొడ్డలి పార్టీ ఎవరిది? అని ప్రశ్నించిన జగన్… గన్ కల్చర్ ఎవరిది? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

గొడ్డలి పార్టీ ఎవరిది అని ప్రశ్నించిన జగన్… తన కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారని తెలిపారు. తన తాత రాజా రెడ్డిని చంపింది ఎవరని ప్రశ్నించిన జగన్… తన తాతను హత్య చేసింది టీడీపీ వారే కదా అని అన్నారు. ఈ హత్య చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే జరిగిందని తెలిపారు. ఇక తన బాబాయి వివేకానందరెడ్డి హత్య కూడా చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే జరిగిందన్న విషయాన్ని జగన్ ప్రస్తావించారు. బాదితులమైన తమపైనే చంద్రబాబు నిందారోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఇక తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయిన అంశాన్ని ప్రస్తావించిన జగన్… ఈ ఘటన వెనుక కూడా చంద్రబాబు హస్తం ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. నాడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉండగా… అసెంబ్లీ సాక్షిగా రాజశేఖరరెడ్డి అసెంబ్లీకి ఎలా వస్తారో చూస్తానని చంద్రబాబు అన్నారని… చంద్రబాబు నోట ఈ మాటలు వచ్చిన మూడు, నాలుగు రోజులకే రాజశేఖరరెడ్డి చనిపోయారని ఆయన అన్నారు.

ఇక గన్ కల్చర్ పార్టీ అంటూ వైసీపీని తూలనాడుతున్న విషయాన్ని కూడా ప్రస్తావించిన జగన్… అసలు గన్ కల్చర్ ఎవరిది అని ప్రశ్నించారు. చంద్రబాబు బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే తుపాకీ తీసుకుని ఇద్దరు వ్యక్తులపైకి కాల్పులు జరపలేదా? అని ప్రశ్నించిన జగన్…ఆ కాల్పులు ఇద్దరు వ్యక్తులు లేసిపోలేదా? అని ప్రశ్నించారు. గన్ లను ఇస్టానుసారంగా వాడే వారున్న పార్టీ టీడీపీ అని… గన్ కల్చర్ కలిగిన పార్టీ టీడీపీనేనని జగన్ ఆరోపించారు.