సీఎం విజ‌య్‌పై ఉద్యోగుల తిరుగుబాటు?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి ప‌ట్టుమని ప‌ది రోజులు కూడా కాక‌ముందే.. ఇటు రాజకీయంగా .. అటు పాల‌న ప‌రంగా.. తాను తీసుకుంటున్న నిర్ణ‌యాలు.. విజ‌య్‌కు ప్ర‌తిబంధ‌కంగా మారుతున్నాయి. రాజ‌కీయంగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం డీఎంకే నుంచి.. అదేవిధంగా మిత్ర‌పక్షం సీపీఎం నుంచి కూడా ఆయ‌న‌కు విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. విజ‌య్ ప్ర‌భుత్వం రీల్స్ స‌ర్కారు అంటూ.. స్టాలిన్ చేసిన వ్యాఖ్య‌లు.. రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీశాయి.

మ‌రోవైపు.. సీపీఎం కూడా త‌మ మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకునేది అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిక‌లు చేసింది. అన్నాడీఎంకే నుంచి విడివ‌డి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఎమ్మెల్యేలు 30 మందిలో 20 మంది టీవీకే విజ‌య్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. అయితే..వారిలో కొంద‌రికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంద‌న్న సంకేతాలు రావ‌డంతో సీపీఎం ఈ హెచ్చ‌రిక‌లు చేసింది. ఈ రెండు అంశాలు.. రాజ‌కీయంగా సీఎం విజ‌య్‌కు ఇబ్బందిగానే మారాయి.

ఇక‌, ఉద్యోగుల విష‌యానికి వ‌స్తే.. రెండు కీల‌క నిర్ణ‌యాలు.. వారిలో సీఎం విజ‌య్‌పై ఆగ్ర‌హాన్ని అమాంతం పెంచేశాయి. వాస్త‌వానికి సీఎంగా ఆయ‌న ప్ర‌జాకోణంలోనే ఆలోచించి.. రెండు నిర్ణ‌యాలు ప్ర‌క‌టించారు. కానీ, ఇవి ఉద్యోగుల‌కు న‌చ్చ‌డం లేదు. వారు మెచ్చ‌డ‌మూ లేదు. దీంతో తిరుగుబాటు చేయ‌క త‌ప్ప‌ద‌ని.. ప్ర‌ధాన ఉద్యోగం సంఘం నాయ‌కులు హెచ్చ‌రించిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. ఇవేవీ సీఎం లెక్క‌చేయ‌ర‌ని.. టీవీకే వ‌ర్గాలు స‌హా.. ప్ర‌భుత్వ వ‌ర్గాలు కూడా చెబుతున్నాయి.

ఏంటా నిర్ణ‌యాలు..?

1) ఉద్యోగులు విధిగా ఉద‌యం 10 గంట‌ల‌కు ఆఫీసుకు రావాలి. అంతేకాదు.. మ‌ధ్యాహ్న భోజ‌న స‌మ‌యంలో కూడా కేవ‌లం 40 నిమిషాలు మాత్ర‌మే వాడుకోవాల‌ని సీఎంగా విజ‌య్ ఆదేశించారు. ఇది రాష్ట్రంలోన్ని అన్ని కార్యాల‌యాల‌కు వ‌ర్తిస్తుంద‌ని తెలిపారు. అంతేకాదు..క్యాంటీన్ల‌లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసి… అక్క‌డ కూర్చొని బాతాఖానీ కొట్టే ఉద్యోగుల‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వాల‌న్నారు. ఇది ఉద్యోగుల‌కు మింగుడు ప‌డ‌డం లేదు.

2) లంచావ‌తారాల‌కు చెక్‌: ప్ర‌భుత్వ ఉద్యోగులు.. అది పోలీసైనా.. రెవెన్యూ అయినా.. ఏ శాఖ‌లో అయినా.. ఎవ‌రైనా లంచం అని అడిగితే.. వెంట‌నే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తామ‌ని సీఎం హెచ్చ‌రించారు. అంతేకాదు.. లంచావ‌తారాల‌ను ప‌ట్టించిన వారికి రూ.ల‌క్ష కానుక ప్ర‌క‌టించారు. ఇది ఉద్యోగుల‌ను మ‌రింత ర‌గిలిపోయేలా చేసింది. తాము లంచావ‌తారుల‌మా? అంటూ.. వారు ప్ర‌శ్నిస్తున్నారు. దీనిని వ్య‌తిరేకిస్తూ.. రాష్ట్ర‌స్థాయిలో పెన్ డౌన‌కు రెడీ అవుతున్నారు.