మహసేన రాజేష్ vs రఘురామ

ఉండి ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు… టీడీపీ నేతగానే కొనసాగుతున్నా.. ఆయనపై అదే పార్టీకి చెందిన కొందరు నేతలు విమర్శలు సందిస్తున్నారు. ప్రత్యేకించి దళిత సామాజిక వర్గానికి చెందిన నేతలు రఘురామపై ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా… వారికి రఘురామ కూడా తనదైన శైలిలో సమాధానం ఇస్తూ సాగుతున్నారు.

ఈ క్రమంలోనే టీడీపీకే చెందిన మహాసేన రాజేశ్ చేసిన ఆరోపణలను ఖండిస్తూ రఘురామ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆకివీడు రామాలయానికి రాజేశ్ చేసిన మేలేమిటో కూడా తనకు అర్థం కావడం లేదని ఆయన సెటైర్లు సంధించారు.

అయినా రాజకీయాలన్నాక… ఆయా అంశాలపై ఒక్కో నేత ఒక్కో రకంగా స్పందిస్తారని రఘురామ అన్నారు. రాజకీయ వైరాన్ని వ్యక్తిగత వైరంగా ఎలా చూస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. తాను మాజీ ఎంపి విజయ సాయి రెడ్డితో మాట్లాడటాన్ని రాజేశ్ ఎలా తప్పుబడతారని కూడా ఆయన ప్రశ్నించారు. వైసీపీలో ఉండగా… సాయిరెడ్డితో తాను స్నేహంగానే ఉన్నానని చెప్పారు. తానెవరితో మాట్లాడాలో, ఎవరితో మాట్లాడొద్దో రాజేశ్ ఎలా నిర్ణయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉండి నియోజకవర్గ పరిధిలోని ఆకివీడు పెదపేటలో నెలకొన్న రామాలయ వివాదం నేపథ్యంలోనే ఈ తరహా విచిత్ర పరిస్థిత నెలకొందని చెప్పాలి. పెదపేటలో రామాలయమే లేదని, అక్కడ గొంతేనమ్మ గుడి మాత్రమే ఉందన్నది పెదపేట దళితుల వాదన.

అయితే ప్రభుత్వ రికార్డుల ప్రకారం అక్కడి భూమి రామాలయానికి చెందినదేనని రఘురామ చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఆయన పక్కా ఆధారాలు చూపుతూ ఏకంగా హైకోర్టు ఆదేశాలతోనే రామాలయ నిర్మాణాన్ని మొదలుపెట్టారు.

ఈ వివాదంపై దళిత సంఘాలకు చెందిన నేతలు తనను తప్పుబడుతున్న తీరును రఘురామ ఖండించారు. ఆకివీడు రామాలయం నిర్మాణానికి తన సహకారం కూడా ఉందని రాజేశ్ చేసిన వ్యాఖ్యలపై రఘురామ విచిత్రంగా స్పందించారు.

రాజేశ్ వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన రఘురామ… రాజేశ్ ఏ రీతిన రామాలయం నిర్మాణానికి సహకరించారో తనకు అర్థం కావడం లేదని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఒకవేళ రామాలయ నిర్మాణానికి తాను తోడ్పాటు అందించానని రాజేశ్ అనుకుంటే.. ఆయనకు ధన్యవాదాలు అంటూ రఘురామ ఓ ఆసక్తికర కామెంట్ చేశారు.