మరోసారి పొన్నం గందరగోళం

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ లో భిన్న వాదనలు వినిపించాయి. ఈ కేసులో మున్నూరు కాపు సంఘాలు కలుగజేసుకుని భగీరథ్ తో బాలికకు వివాహం జరిపించేలా ఓ రాజీ మార్గాన్ని చూడాలంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఖండించారు. రాజీ వ్యాఖ్యలు పొన్నం వ్యక్తిగతమన్న మహేశ్… ఆ వ్యాఖ్యలతో పార్టీకి గానీ, ప్రభుత్వానికి గానీ ఎలాంటి సంబంధం లేదని తేల్చి పారేశారు. అంతేకాకుండా చట్టప్రకారంగా భగీరథ్ పై విచారణ కొనసాగుతుందని కూడా ఆయన పునరుద్ఘాటించారు.

మైనర్ బాలికపై భగీరథ్ ఆనుమతితోనే అత్యాచారం చేశారన్న వాదనలపై మహేశ్ గౌడ్ తనదైన శైలిలో స్పందించారు. మైనర్ బాలిక అయిన బాధితురాలు ఈ వ్యవహారంలో తన అనుమతి ఇచ్చినా… భగీరథ్ చేసింది తప్పేనని ఆయన చెప్పారు. ఈ క్రమంలో భగీరథ్ పై చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని ఆయన స్పష్టం చేశారు.

పోక్సో చట్టం ప్రకారమే భగీరథ్ పై చర్యలు ఉంటాయని కూడా ఆయన పేర్కొన్నారు. నిందితుడు, బాధితురాలిది ఒకే సామాజిక వర్గం అంటూ ఈ వ్యవహారంలోకి కులాన్ని తీసుకురావడం సరికాదని ఆయన అన్నారు. ఈ నేరంలో కుల ప్రస్తావన చేసిన బీజేపీ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు.

భగీరథ్ పై ఇప్పటికే ఫొక్సో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే నిందితుడు ఇంకా అరెస్టు కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నిందితుడు, బాధితురాలు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు కలుగజేసుకుని… భగీరథ్ తో బాధిత బాలికకు పెళ్లి జరిపించే దిశగా ఓ రాజీ పరిష్కారం కనుగొనాలని పొన్నం అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.

అయితే పొన్నం నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడినంతనే కాంగ్రెస్ లో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఈ గందరగోళాన్ని సద్దుమణిగించేందుకు రంగంలోకి దిగిన మహేశ్… పొన్నం వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని తేల్చేశారు. ఆ తర్వాత పొన్నం కూడా తన వ్యాఖ్యల ఉద్దేశ్యం నిందితుడిని కాపాడటం కోసం కాదని కూడా వివరణ ఇచ్చారు.