పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. ఉదయం 11 గంటలకు బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం.చేశారు. ఈ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. కాంగ్రెస్ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సువేందు అధికారి .. తృణమూల్ కాంగ్రెస్లో కీలక నేతగా ఎదిగి, అనంతరం బీజేపీలో చేరి ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి స్థాయికి చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సువేందు అధికారి కుటుంబానికి కాంగ్రెస్తో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో రాజకీయాల్లో గుర్తింపు పొందగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ నేతగా ప్రభావం చూపారు. ఆ రాజకీయ వారసత్వంతోనే సువేందు ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు.
తర్వాత మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్లో చేరిన సువేందు అధికారి, పార్టీ విస్తరణలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా నందిగ్రామ్ ఉద్యమం సమయంలో ఆయన ప్రభావం మరింత పెరిగింది. మమతకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన ఆయన, రవాణా మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ బలోపేతానికి కృషి చేసిన నేతల్లో సువేందు ఒకరిగా గుర్తింపు పొందారు.
అయితే పార్టీ అంతర్గత వ్యవహారాలపై అసంతృప్తితో సువేందు అధికారి టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గంలో స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయనకు జైంట్ కిల్లర్గా రాజకీయ గుర్తింపు వచ్చింది.
ఇప్పటికే బెంగాల్లో బీజేపీ ప్రధాన ముఖచిత్రంగా మారిన సువేందు అధికారిని సీఎం అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం ప్రకటించడంతో రాజకీయ చర్చలు మరింత వేడెక్కాయి. ఇదే సమయంలో 2016లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో సువేందు అధికారి అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారని విమర్శించిన మోదీ.. ఇప్పుడు అదే నేతను సీఎం అభ్యర్థిగా నిలబెట్టడంపై రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates