ప్రజాప్రతినిధుల విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధుల విషయంలో గౌరవాన్ని పాటించి తీరాల్సిందేనని తెలిపింది. దాదాపు లక్షల మంది ఓట్లు వేసి.. గెలిపించిన ప్రజా ప్రతినిధుల విషయంలో అగౌరవంగా వ్యవహరించేందుకు పోలీసులకు, అధికారులకు ఎలాంటి హక్కులు ఉన్నాయో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రాల హోం శాఖలను కూడా ఆదేశించింది.
తాజాగా ఓ కేసు విచారణ సందర్భంగా ఎమ్మెల్యే విషయంలో పోలీసులు నమోదు చేసిన కేసులో ఆయనను మిస్టర్ అని సంబోధించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ప్రజా ప్రతినిధుల పేర్ల ముందు.. గౌరవనీయ(రెస్పెక్టెడ్) అని రాయాల్సిందేనని స్పష్టం చేసింది.
ఇది వ్యక్తులకు ఇస్తున్న గౌరవం కాదని.. ప్రజాప్రతినిధులుగా రెండు లక్షల మందికి పైగా వారు బాధ్యత వహిస్తున్నందన.. ప్రజలకు ఇచ్చే గౌరవమని పేర్కొంది. కేసు ఎలాంటిదైనా.. నేరం ఎలాంటిదైనా.. ప్రజా ప్రతినిధుల పేర్ల ముందు గౌరవనీయ అనే పదం చేర్చాల్సిందేనని తెలిపింది.
ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని పేర్కొంది. అంతేకాదు.. సాధారణ పౌరుల విషయంలోనూ పోలీసులు హద్దులు మీరుతున్నారని.. ఇది సరికాదని పేర్కొంది. రూల్ ఆఫ్ లా ప్రకారం.. దేశంలోని ప్రతి ఒక్కరూ గౌరవానికి అర్హులేనని స్పష్టం చేసింది.
పోలీసులు ప్రత్యేక చట్టాలు రాసుకున్నారా? అని ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నించారు. అలా కానప్పుడు.. భారత రాజ్యాంగం అందరినీ సమానం చూస్తుందని.. సామాన్య పౌరులకు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ.. పోలీసు స్టేషన్లలోనూ గౌరవం దక్కి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు పోలీసులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నోటీసులు జారీ చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates