చాట్ జీపీటీతో ట్రాన్స్ ఫర్ ఆర్డర్..!

మనిషి తన పనులను మరింత సులభతరం చేసుకునేందుకు ఎప్పటికప్పుడు సాంకేతికతను అభివృద్ధి చేసుకుంటూ సాగుతున్నాడు. అయితే అదే సాంకేతికతను వినియోగించి అక్రమార్కులు కూడా స్వైర విహారం చేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా ఏపీలో గురువారం ఓ ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనలో ఓ ప్రభుత్వ ఉద్యోగిని కొందరు అక్రమార్కులు చాట్ జీపీటీ టెక్నాలజీని వినియోగించి ట్రాన్స్ ఫర్ చేశారు. వారి మాట నమ్మి ఆ బదిలీ ఉత్తర్వులను తీసుకుని వెళ్లిన సదరు ఉద్యోగి… ఆ ఉత్తర్వు నకిలీదని తెలుసుకుని అవాక్కయ్యారు.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే… శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలానికి చెందిన రమణమ్మ కడప జిల్లాలోని గాలివీడులోని ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. దూరాభారాన్ని తగ్గించుకునే క్రమంలో గాలివీడు నుంచి తనకల్లుకు బదిలీ కోసం యత్నించారు. అందులో భాగంగా రమణమ్మ భర్త జయచంద్ర తనకు తెలిసిన పలక వేణును సంప్రదించారు. వేణు తన కుమారుడైన పలక గంగాద్రితో కలిసి పెద్ద స్కెచ్చే వేశారు. వేణు, గాంగాద్రిలిద్దరూ కలిసి అధునాతన సాంకేతికతను వినియోగించి నకిలీ బదిలీ ఉత్తర్వులను సృష్టించారు.

రమణమ్మ వివరాలను చాట్ జీపీటీలో ఎంటర్ చేసిన వేణు, గంగాద్రిలు… ఆమెను కడప జిల్లాకు చెందిన గాలివీడు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లులోని ప్రభుత్వ ఆసుపత్రికి బదిలీ చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ సమాచారం ఆధారంగా ఏఐ టూల్ ను వినియోగించిన చాట్ జీపీటీ రమణమ్మ బదిలీ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల కాపీని వారిద్దరూై జయచంద్రకు అందజేశారు. అచ్చుగుద్దినట్టు ఒరిజినల్ ట్రాన్స్ ఫర్ ఆర్డర్ లానే ఉన్న సదరు ప్రతిని పట్టుకుని రమణమ్మ తనకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు.

రమణమ్మ అందించిన బదిలీ ఉత్తర్వులను చూసిన తనకల్లు వైద్యాధికారులు… దానిని పరిశీలించి అది నకిలీ ఆర్డర్ అని తేల్చేశారు. హెల్త్ డిపార్ట్ మెంట్ నుంచి తమకు ఉత్తర్వులేమీ రాని నేపథ్యంలో రమణమ్మ అందించిన ఉత్తర్వులను వారు నకిలీదిగా తేల్చారు. దీనిపై వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం మొత్తాన్ని పరిశీలించి మోసం జరిగిందని గుర్తించిన పోలీసులు… వేణు, గంగాద్రిని అరెస్ట్ చేశారు. బదిలీ కావాలంటే సంబందిత అధికారులను కలవాల్సింది పోయి ఇలా మధ్యవర్తులను కలవడమేమిటని వారు బాధితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.