ప‌సుపు జెండా పౌరుషం ఎప్పుడూ త‌గ్గ‌లేదు

టీడీపీ నూత‌న కార్య‌వ‌ర్గ ప్ర‌మాణ స్వీకారం ఘ‌నంగా జ‌రిగింది. ఇటీవ‌ల పార్టీలో జాతీయ‌, రాష్ట్ర స్థాయి కార్య‌వ‌ర్గాల‌తోపాటు.. పొలిట్ బ్యూరోను కూడా ప్ర‌క్షాళ‌న చేశారు. తాజాగా కొత్త నాయ‌క‌త్వంతో పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం చేయించారు. దీనికి ముందు .. కార్య‌క్ర‌మం అనం త‌రం కూడా .. చంద్ర‌బాబు నూత‌న కార్య‌వ‌ర్గాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కార్య‌క‌ర్త‌ల్లో స్ఫూర్తి నింపే ప్ర‌య‌త్నం చేశారు.

పార్టీలు ఎన్నో వ‌స్తుంటాయి.. పోతుంటాయ‌ని.. కానీ, ఎన్ని ఒడిదుడుకులువ‌చ్చినా.. టీడీపీ ఎదురు నిలిచి నిలిచింద‌ని చంద్ర‌బాబు ఉద్ఘాటించారు. పార్టీ ఆవిర్భావమే ఒక సంచ‌ల‌న‌మ‌న్న ఆయ‌న‌.. తొలి నాళ్ల‌లో స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే పార్టీ అధికారంలోకి వ‌చ్చింద‌ని తెలిపారు. అధికారంలో ఉన్న‌ప్పుడూ.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కూడా.. టీడీపీ ప్ర‌జా పక్షమేనన్నారు. ఓడిపోయిన పార్టీలు అస్తిత్వం కోసం పాకులాడుతున్న ప‌రిస్థితి క‌ళ్ల ముందే క‌నిపిస్తోంద‌ని వైసీపీని ఉద్దేశించి ప‌రోక్షంగా వ్యాఖ్యానించారు.

కానీ, టీడీపీ ప‌సుపు జెండా ఓడినా.. గెలిచినా.. పౌరుషం ఎప్పుడూ త‌గ్గ‌లేద‌ని చంద్ర‌బాబు నొక్కి చెప్పారు. కార్య‌క‌ర్త‌ల‌కు శిక్ష‌ణ ఇచ్చే ఏకైక పార్టీ టీడీపీనేన‌ని తెలిపారు. టీడీపీకి సంక్షోభాలు కొత్త‌కాద‌ని.. కానీ, సంక్షోభాలు ఎదురైన ప్ర‌తిసారీ వాటిని స‌వాళ్లుగా తీసుకుని ముందుకు సాగింద‌ని చంద్ర‌బాబు వివ‌రించారు. 44 ఏళ్ల పార్టీ ప్ర‌స్థానంలో తెలుగు వారి ఆత్మ‌గౌర‌వాన్ని.. న‌లుదిశ‌లా వ్యాపించేలా చేసింద‌న్నారు. ప్ర‌స్తుతం ఒక్క ఓట‌మితోనే ప‌క్క‌కు పోతున్న పార్టీలు అనేకం ఉన్నాయ‌ని.. కానీ, టీడీపీ స‌గ‌ర్వంగా నిలిచింద‌ని పేర్కొన్నారు.

గ‌త ఎన్నిక‌ల కంటే..

గ‌త 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సాధించిన విజ‌యం కంటే కూడా 2029లో మ‌రింత ఎక్కువ‌గా విజ‌యం ద‌క్కించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చంద్ర‌బాబు నిర్దేశించారు. ఈ దిశ‌గా కార్య‌క‌ర్త‌ల‌ను ముందుకు న‌డిపించే బాధ్య‌త కొత్త కార్య‌వ‌ర్గానికి ఉంద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ పార్టీ సిద్ధాంతాల‌ను అనుస‌రించాల‌ని.. సూచించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రింత ఓటింగ్ పెరిగేలా కృషి చేయాల‌ని నిర్దేశించారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌కు టీడీపీనే కీల‌క భూమిక పోషిస్తోంద‌ని ఉద్ఘాటించారు. మ‌హిళ‌ల‌కు రాజ‌కీయంగా ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ కూడా టీడీపీనేన‌ని చెప్పారు.