రైతుల ఉద్యమం ఇప్పట్లో ఆగేలా లేదు

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ దాదాపు రెండు నెలల క్రితం మొదలైన రైతు ఉద్యమం ఇప్పటితో ఆగేలా లేదు. హర్యానా-ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘూ ప్రాంతంలో అన్నదాతలను ఢిల్లీ పోలీసులు అడ్డగించిన విషయం తెలిసిందే. ఢిల్లీలోకి ప్రవేశించేందుకు రైతులు ప్రయత్నాన్ని సింఘూ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. అప్పటి నుండి అక్కడే అన్నదాతలు మకాం వేసేశారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు, ఎట్టిపరిస్ధితుల్లోను చట్టాలను రద్దు చేసేది లేదని కేంద్రప్రభుత్వం పట్టుబట్టిన నేపధ్యంలో రైతుల ఉద్యమం నిరంతరంగా సాగుతోంది.

రైతుల ఉద్యమ తీరు చూస్తుంటే ఇప్పట్లో ఆగేట్లుగా లేదు. ఎందుకంటే సుదీర్ఘకాలం ఉద్యమం చేయటానికి మెంటల్ గా ప్రిపేర్ అయిన తర్వాత రైతు సంఘాలు ఉద్యమానికి నడుం బిగించినట్లు అర్ధమైపోతోంది. సింఘూ ప్రాంతంలోనే వేలాదిమంది రైతులు వేలాది టెంట్లు వేసుకున్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో నుండి పెద్ద ఎత్తున రైతులు ఉద్యమ ప్రాంతానికి చేరుకున్నారు. యావత్ దేశాన్ని చలిపులి వణికించేస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి ఢిల్లీని చలి వణికించేస్తోంది.

ఇంతటి చలిలో కూడా రైతులు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా రెండు నెలలుగా ఉద్యమం చేస్తున్నారంటేనే వాళ్ళెంత ప్రిపేర్డుగా ఉన్నారో అర్ధమైపోతోంది. పై రెండు రాష్ట్రాల నుండి రైతుల కుటుంబాల నుండే కాకుండా గ్రామాలు, విదేశాల నుండి కూడా ఉద్యమనికి అవసరమైన నిధులు అందుతున్నట్లు సమాచారం. ఉద్యమంలో పాల్గొన్న రైతులకు చెందిన భూములను ఆయా గ్రామాల్లోని మిగిలిన రైతుల కుటుంబాలు సంరక్షిస్తున్నాయట.

ఇక సింఘూ ప్రాంతంలో చలిని తట్టుకునేందుకు టెంట్లలో హీటర్లు కూడా పెట్టుకున్నారు. భోజనానికి అవసరమైన రోటీ, కర్రీ, దాల్ మేకర్లు కూడా ఉన్నాయి. వృద్ధులకు మంచాలతో పాటు పరుపులు, రజాయిలు కూడా ఉన్నాయి. వీళ్ళకు వైద్య సైకర్యాలు అందించేందుకు డాక్టర్ల బృందాలు కూడా వంతులవారీగా పై రాష్ట్రాల నుండి వస్తున్నాయి. వంతుల వారీగా వైద్య బృందాలు వచ్చి కొద్ది రోజులపాటు వీళ్ళతోనే ఉంటున్నాయి. స్వచ్చంద సంస్ధలు ఉద్యమానికి మద్దతుగా ఇతరత్రా ఆహారాన్ని, మందులను అందిస్తున్నాయి. మరికొన్ని సంస్ధలైతే ఇంటర్నెట్, ల్యాపుటాపులు, కంప్యూటర్లు, జనరేటర్లను కూడా అందించినట్లు సమాచారం. చేసుకున్న ఏర్పాట్లను చూస్తుంటే రైతుల ఉద్యమం ఇప్పట్లో ఆగేట్లు లేదు.