సీట్ల పెంపు… ఒకేసారి 300 సీట్లా?

Glimpses of the new Parliament Building, in New Delhi

నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఓ అవగాహనకు వచ్చింది. ఈ నెల 16న మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కూడా కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో లోక్ సభ నియోజకవర్గాలను ఏ మేరకు పెంచాలన్న అంశంపై కేంద్రం ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్టు సమాచారం. బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పెరగనున్న సీట్ల సంఖ్య ఏ మేర అన్న వివరాలతో కూడిన బిల్లు ప్రతులను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఇప్పటికే ఎంపీలకు అందజేసింది. 

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ప్రస్తుతం లోక్ సభలో 543 మంది ఎంపీలు ఉన్నారు. ఈ సంఖ్యను ఒకేసారి 850కి పెంచాలని కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చింది. అంటే .. ప్రస్తుతం ఉన్న లోక్ సభ సీట్లకు పునర్విభజనతో ఒకేసారి ఏకంగా 300 సీట్లు జత కలవనున్నాన్నమాట. 29 రాష్ట్రాలతో పాటుగా కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన లోక్ సభ సీట్లను పెంచే దిశగా కేంద్రం కసరత్తు పూర్తి చేసింది. పునర్విభజన తర్వాత 29 రాష్ట్రాల్లో 815 లోక్ సభ సీట్లు ఉండనుండగా… మిగిలన 35 సీట్లు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవిగా ఉండనున్నాయి.

నియోజకవర్గాల పునర్విభజన ప్రభావం ఎలా ఉంటుందన్న అంశంపై భిన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. సీట్ల సంఖ్య ఓ రేంజిలో పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న వారికి ఇది శుభపరిణామమేనని చెప్పక తప్పదు. వచ్చీరావడంతోనే లోక్ సభ సభ్యుడిగా గెలిచే అవకాశం కొత్త అభ్యర్థులకు దక్కనుంది. అంతేకాకుండా నియోజకవర్గాల పునర్విభజన ఫలితంగా కొత్త నియోజకవర్గాల నిడివి తగ్గనున్న నేపథ్యంలో… ఆయా నియోజకవర్గాలను చుట్టేయడం కూడా కొత్త అభ్యర్థులకు ఈజీగా ఉంటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే… నియోజకవర్గాల పునర్విభజన రాజకీయ పార్టీలకు పెను సంకటంగా మారే ప్రమాదం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే… ఎప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరిగినా… ఆ వెంటనే జరిగే ఎన్నికల్లో అటు అభ్యర్థులతో పాటుగా ఇటు పార్టీలకు కూడా ఆయా నియోజకవర్గాలపై అంతగా పట్టు ఉండదనే చెప్పాలి. ఇక అధికారంలో ఉన్న పార్టీలు ఈ పునర్విభజనను తమకు అనుకూలంగా చేసుకుని ముందుకు సాగితే… విపక్షంలో ఉన్న పార్టీలు అభ్యర్థుల వేటకు చాలానే కష్టపడాల్సి ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.