గెలిచిన 5 నెలల్లోపే సీఎం పదవికి రాజీనామా

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం తన పదవికి రాజీనామా చేసి గవర్నర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. దాదాపు 21 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన ఆయన నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారితీసింది. పలు మార్లు కూటములు మార్చుకుంటూ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నితీశ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. 243 సభ్యుల అసెంబ్లీలో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలవడంతో తన శాసనసభా పక్ష సమావేశంలో కొత్త నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభించింది. ముఖ్యమంత్రి పదవికి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి పేరు ముందంజలో ఉండగా, నిత్యానంద రాయ్, రేణుదేవి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఎన్‌డీఏ కూటమి సమావేశంలో తుది నిర్ణయం తీసుకుని కొత్త సీఎం పేరును ప్రకటించే అవకాశముంది.

రాజీనామా నిర్ణయాన్ని ముందుగానే తన మంత్రివర్గానికి తెలియజేసిన నితీశ్ కుమార్, కొత్త ప్రభుత్వానికి అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తానని పేర్కొన్నట్లు సమాచారం. గతంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో గుర్తింపు పొందిన ఆయన, రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త ముఖ్యమంత్రి ఎంపిక అనంతరం ఏప్రిల్‌ 15న ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉంది. నితీశ్ కుమార్ వైదొలగడంతో బీహార్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుండగా, బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం ఎలా ముందుకు సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.