జగన్ ఫెయిల్.. కేసీఆర్ సంగతేంటి?

లాక్ డౌన్‌ నుంచి మినహాయింపుల్లో భాగంగా దేశవ్యాప్తంగా సోమవారం నుంచి మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో పరిస్థితులకు అద్దం పట్టే వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ రోజు ఉదయం నుంచే మందుబాబులు మద్యం దుకాణాల మందు బారులు తీరారు.

ఐతే కొన్ని చోట్ల సోషల్ డిస్టన్సింగ్ బాగానే పాటిస్తున్నారు. స్వచ్ఛందంగా జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు. పోలీసుల నియంత్రణా బాగుంది. కానీ కొన్ని చోట్ల మాత్రం భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. భౌతిక దూరం అనే మాటే లేదు. మాస్కుల్లేవు. ఒకరిపై ఒకరు మీద పడి వందలు వేలమంది కనిపిస్తున్నారు. దీంతో కరోనా మళ్లీ విలయ తాండవం చేస్తుందేమో అన్న భయం కలుగుతోంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది.

చిత్తూరు, మచిలీ పట్నం, గుంటూరు.. ఇలా పలు ప్రాంతాలకు సంబంధించిన వీడియోలు చూస్తే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. జనాల్ని నియంత్రించడంలో, ముందు జాగ్రత్తలు పాటించడంలో అధికారులు, పోలీసులు పూర్తిగా విఫలమైన పరిస్థితి కనిపిస్తోంది.

అసలే ఏపీలో చాలా జిల్లాల్లో కరోనా వ్యాప్తి ప్రమాదకర స్థాయిలో ఉంది. ఈ రోజు కూడా 60కి పైగానే కేసులు బయటపడ్డాయి. ఇలాంటి సమయంలో సరైన ప్లానింగ్ లేకుండా మద్యం దుకాణాలు తెరవడంతో రాబోయే రోజుల్లో వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉంటుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఐతే మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో మాత్రం మద్యం దుకాణాలు తెరుచుకోలేదు. ఈ నెల 7 వరకు ఇక్కడ షరతులు కొనసాగనున్నాయి. 8న మద్యం దుకాణాలు తెరుస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఐతే ఏపీలో ఈ రోజు పరిస్థితులు చూశాక మద్యం ద్వారా ఆదాయం రాకపోయినా పర్వాలేదనే ఆలోచన కేసీఆర్ చేస్తారేమో అనిపిస్తోంది. వైన్ షాపులు తప్పక తెరవాల్సిన పరిస్థితి వచ్చినా.. ఏపీలో మాదిరి పరిస్థితులు అదుపు తప్పకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడానికి చూస్తారు. ఈ విషయంలో ఏపీ అనుభవం తెలంగాణకు పాఠమవుతుందనడంలో సందేహం లేదు.