అగ్నికి ఆజ్యం పోసిన అంబటి

ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించే కూటమి సర్కారు తీసుకున్న చర్యలు విపక్ష వైసీపీని ఓ రేంజిలో కలవరపాటుకు గురి చేశాయని చెప్పక తప్పదు. అమరావతికి తాము వ్యతిరేకం కాదంటూనే… అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగకుండా తాము అధికారంలోకి వస్తే మరో బిల్లు పెట్టలేమా? అంటూ భిన్న వాదనలతో స్వైర విహారం చేస్తున్నారు. ఈ తరహా వైఖరితో జనంలో పార్టీ బాగా పలచన అయిపోయిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఇలాంటి తరుణంగా ఆగ్నికి ఆజ్యం తోడైనట్లు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.

సోషల్ మీడియాలో ట్రోలింగ్ మెటీరియల్ అయిన మావిగన్ ను పట్టుకుని అంబటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ అభివృద్ధికి మావిగన్ ఓ మంత్రం లాంటిదని ఆయన అన్నారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాతే మావిగన్ పై ట్రోలింగ్ మొదలుపెట్టారని కూడా ఆయన తనదైన శైలి భాష్యం చెప్పారు.

వాస్తవానికి గతంలో అమరావతి, విశాఖ, కర్నూలు పేరిట మూడు రాజధానుల జపం చేసిన జగన్… ఇప్పుడు కొత్తగా మావిగన్ అనే నినాదం ఇవ్వడంతో ఆయన ఒక్కమాట మీద నిలబడరన్న వాదనలకు బలం చేకూరింది. అంతేకాకుండా మావిగన్ పై టీడీపీ సానుభూతిపరులే కాకుండా జనరల్ పబ్లిక్ కూడా ఓ రేంజిలో సెటైర్లు సంధిస్తున్నారు. అయినా అంబటి మావిగన్ అభివృద్ధి మంత్రం అంటూ చెప్పడం గమనార్హం.

జగన్ నోట నుంచి వచ్చిన మావిగన్ ను జనం అంగీకరిస్తున్నారని కూడా అంబటి ఓ కన్ క్లూజన్ ఇచ్చిపడేశారు. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పినట్టుగానే.. అంబటి కూడా అమరావతిని తాము మార్చేస్తామని చెప్పేశారు. అమరావతిని శాశ్వత రాజధాని అని కూటమి ఓ బిల్లును పాస్ చేస్తే… దానిని  తొలగించేందుకు తాము మరో బిల్లును పాస్ చేయించలేమా? అంటూ అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక అమరావతి ఎప్పటికీ అభివృద్ధి కాదని చెప్పిన అంబటి… రాష్ట్రం అభివృద్ధి చెందాలంటూ మావిగన్ నే పరమావధి అన్నట్లుగా ఓ రూలింగ్ ఇచ్చేశారు. అంబటి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.