ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్‌: `ఐప్యాక్`పై ఈడీ న‌జ‌ర్‌!

పొలిటిక‌ల్ క‌న్స‌ల్టెన్సీ సంస్థ‌.. ఐప్యాక్‌పై ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఏక‌కాలంలో గురువారం.. దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో ఐప్యాక్ సంస్థ‌ల‌కు సంబంధించిన కార్యాలయాల్లో త‌నిఖీ చేప‌ట్టారు. బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌, ముంబై స‌హా.. ఇత‌ర ప్రాంతాల్లోనూ ఈ త‌నిఖీలు కొన‌సాగుతున్న‌ట్టు ఈడీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. వంద‌ల కోట్ల రూపాయ‌ల మనీలాండరింగ్ కేసులో త‌నిఖీలు చేస్తున్న‌ట్టు వివ‌రించింది.

అయితే.. ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ దాడులు జ‌ర‌గ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ప‌శ్చిమ బెంగాల్‌లోని అధికార పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్‌కు ఐప్యాక్ సంస్థ‌.. స‌ల‌దారుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. వ‌రుస‌గా నాలుగోసారి కూడా అధికారం ద‌క్కించుకునేందుకు సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో 2019 నుంచి ఆమెకు ఐప్యాక్ సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తోంది. ఆమె కూడా ఐప్యాక్ క‌నుసన్నల్లో మ‌రోసారి అధికారం ద‌క్కించుకోవ‌డం ఖాయ‌మ‌నే ఆశ‌లు పెట్టుకున్నారు.

అయితే… ఐప్యాక్ వ్య‌వ‌హారంపై కేంద్రం గుర్రుగా ఉంది. ప‌శ్చిమ బెంగాల్‌లో అధికారం ద‌క్కించుకోవాల‌ని క‌మ‌ల నాధులు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఐప్యాక్ వంటి సంస్థ‌కు.. మ‌మ‌త‌కు మ‌ధ్య దూరం పెంచ‌డం ద్వారా.. తమకు అవ‌కాశం చిక్కుతుంద‌ని అంచ‌నా వేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే వ్యూహాత్మ‌కంగా  వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బొగ్గును స్మ‌గ్లింగ్ చేసిన వ్య‌వ‌హారంపై కేసు న‌మోదు చేయ‌డంతో పాటు.. ఆగ‌మేఘాల‌పై దీనిని ఈడీకి అప్ప‌గించారు.

ఈడీ అధికారులు గ‌త రెండు నెల‌లుగా ప‌శ్చిమ బెంగాల్‌పై దృష్టి పెట్టారు. అయితే.. వారిని అడ్డుకునేందుకు మ‌మ‌త ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించింది. ఈ వ్య‌వ‌హారం సుప్రీంకోర్టు వ‌ర‌కు చేరింది. చివ‌ర‌కు.. తాజాగా ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో(మ‌రో 20 రోజుల్లో తొలిద‌శ ఎన్నిక‌లు) ఈడీ త‌న దూకుడును పెంచి.. `ఐప్యాక్`పై ఒత్తిడి పెంచేసింది. త‌ద్వారా.. ఐప్యాక్ నిర్వీర్య‌మైతే.. ఆటోమేటిక్‌గా మ‌మ‌తా బెన‌ర్జీ కూడా వీక్ అవుతున్నార‌న్న ఆలోచ‌నతో బీజేపీ ఉంద‌ని మ‌మ‌తా బెన‌ర్జీ ఆరోపిస్తున్నారు.