వైసీపీ అధినేత జగన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చేది `జగన్ 2.0` ప్రభుత్వమేనని చెప్పారు. ఈ విషయంలో తిరుగు లేదన్నారు. పార్టీ నాయకులు రెట్టింపుఉత్సాహంతో పనిచేయాలని సూచించారు. చంద్రబాబును చూసి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.
పార్టీలో కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. వచ్చే రోజుల్లో కార్యకర్తల సెంట్రిక్గా కార్యక్రమాలు నిర్వహిస్తామని జగన్ హామీ ఇచ్చారు. తాజాగా అద్దంకి నియోజకవర్గం పార్టీ బాధ్యులతో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి వారికి దిశానిర్దేశం చేశారు.
క్రెడిట్ చోరీపై..
తమ వైసీపీ హయాంలోనే అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని జగన్ చెప్పారు. వాటిలో గూగుల్ డేటా కేంద్రం(విశాఖ), ఆర్సె ల్లార్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ(నక్కపల్లిలో తాజాగా శంకుస్థాపన జరిగింది)ని కూడా తీసుకువచ్చామన్నారు. అయితే.. ఎన్నికలు రావడంతో కేవలం అప్పట్లో ఒప్పందాలకు మాత్రమే పరిమితం అవ్వాల్సి వచ్చిందన్నారు. తాజాగా ఇవే సంస్థలు ఏపీకి వచ్చాయని తెలిపారు. కానీ.. వీటిని తానే తీసుకువచ్చినట్టు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. అనేక విషయాల్లో క్రెడిట్ చోరీ చేస్తున్నారని విమర్శించారు.
ప్రజల్లోకి..
కార్యకర్తలు, నాయకులు సైతం ప్రజల్లోకి వెళ్లాలని జగన్ సూచించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని.. దీనిని వైసీపీకి అనుకూలంగా మలచాలని ఆయన కోరారు. “ఇప్పటికే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతపెరిగింది. ప్రజలు విసిగిపోయారు. దీనిని మనం సమర్థవంతంగా వినియోగించుకోవాలి. మీరంతా ప్రజల్లో ఉండాలి.“ అని దిశానిర్దేశం చేశారు.
రాబోయే రోజుల్లో పార్టీని సరికొత్తగా తీర్చిదిద్దుతామన్నారు. ‘జగన్ 2.0’లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని జగన్ స్పష్టం చేశారు. అద్దంకి నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకున్నారు.
రిజర్వేషన్ మనకే మంచిది!
ప్రస్తుతం మహిళా రిజర్వేషన్ పెరగడం.. నియోజకవర్గాల సంఖ్య పెరగడం వంటివి కూటమి పార్టీల కంటేకూడా వైసీపీకే ఎక్కువగా మేలు జరుగుతుందని జగన్ చెప్పారు. వైసీపీలో ఉన్న మహిళలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయన్నారు.
అదేవిధంగా కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు కూడా అవకాశం కల్పించనున్నట్టు తెలిపారు. రిజర్వేషన్లు, నియోజకవర్గాల పెంపుతో వైసీపీకి మేలు జరుగుతుందని చెప్పారు. దీనిని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
