కావూరి సాంబ‌శివ‌రావు మృతి.. తెలుసుకోవాల్సింది ఏంటంటే!

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబ‌శివ‌రావు.. బుధ‌వారం ఉద‌యం మృతి చెందారు. గ‌త కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌.. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ.. క‌న్నుమూశారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌సు 82 సంవ‌త్స‌రాలు. కాంగ్రెస్ పార్టీతోనే ఆయ‌న రాజ‌కీయాలు ప్రారంభించారు. ఆ పార్టీలోనే అంచెలంచెలుగా ఎదిగారు.

మ‌చిలీప‌ట్నం, ఏలూరు పార్ల‌మెంటు స్థానాల నుంచి 5 సార్లు(25 సంవ‌త్స‌రాలు) ఎంపీగా గెలిచారు. రాజకీయాల్లో అజాత శ‌త్రువుగా పేరొందారు. కేంద్రంలో 2004-14 మ‌ధ్య మ‌న్మోహ‌న్‌సింగ్ ప్ర‌భుత్వంలో కేంద్ర మంత్రిగా ప‌నిచేశారు. అయితే.. 2014లో.. రాష్ట్ర విభ‌జ‌న‌ను తీవ్రంగా వ్య‌తిరేకించిన వారిలో కావూరి ఒక‌రు. ఏపీ క‌లిసి ఉంటేనే మేలు జ‌రుగుతుంద‌ని.. లేకపోతే అన్ని విష‌యాల్లోనూ వివాదాలు వ‌స్తాయ‌ని ఆయ‌న చెప్పారు.

ఈ క్ర‌మంలోనే తాము చెప్పిన సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదంటూ.. కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌టకు వ‌చ్చారు. ఆ త‌ర్వాత‌.. కొన్నాళ్లు రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. అనంత‌రం.. బీజేపీ ఆహ్వానం మేర‌కు.. ఆ పార్టీలో చేరి.. ఏలూరు నుంచి పోటీ చేసినా.. ప‌రాజ‌యం పాల‌య్యారు. అనంత‌రం రాజ‌కీయాలకు దూరంగా ఉంటూ వ‌చ్చారు. అయితే.. అన్ని పార్టీల నాయ‌కుల‌తోనూ క‌లివిడిగా వ్య‌వ‌హ‌రించారు. జ‌గ‌న్ పై అభిమానం ఉంద‌ని చెబుతూనే.. ఆయ‌న విధానాలను తీవ్రంగా వ్య‌తిరేకించేవారు.

ఏం తెలుసుకోవాలి?

ఒక్కొక్క నాయ‌కుడికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. కావూరిలోనూ అనేక ప్ర‌త్యేకత‌లు ఉన్నాయి. తాను ఎద‌గ‌డంతోపాటు.. ప‌లువురు యువ‌నేత‌లు ఎదిగేలా చేశారు. ఏలూరు, మ‌చిలీప‌ట్నంలోని త‌న ఇంటిని పేద‌లు, అనాథ‌ల‌కు నిత్యాన్న‌దాన కేంద్రాలుగా మార్చారు. ఆయ‌న ఎంపీగా ఉన్న‌న్నాళ్లూ.. పేద‌ల‌కు నిత్యం మూడు పూట‌లా ఉచిత ఆహ‌రం అందించారు. అనేక స్వ‌చ్ఛంద కేంద్రాల‌ను ఏర్పాటు చేసి.. మ‌హిళా విద్య‌ను ప్రోత్స‌హించారు.

మ‌హిళ‌ల‌ అభిరుచి మేర‌కు అనేక రంగాల్లో శిక్ష‌ణ‌ను ఇప్పించి స్వ‌యం ఉపాధి మార్గాలు చూపించారు. “పార్టీల‌దేముంది..” అంటూ అన్ని పార్టీల నాయ‌కుల‌తో క‌లివిడిగా వ్య‌వ‌హ‌రించారు. అయితే.. ఆయ‌న‌పైనా మ‌ర‌క‌లు ఉన్నాయి. కొన్ని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ‌వేశార‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆయా బ్యాంకుల వారు.. హైద‌రాబాద్‌లోని కావూరి నివాసం ముందు వారం రోజులు ధ‌ర్నా చేయ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది. ఆ త‌ర్వాతే.. ఆయ‌న బీజేపీలోకి చేర‌డం విశేషం.