తిరుపతిలో టీడీపీ ‘వ్యూహకర్త’ బిజీ బిజీ

తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో గెలుపును తెలుగుదేశంపార్టీ బాగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లే కనబడుతోంది. అందుకనే ఎన్నిక నోటిఫికేషన్ రావటానికి ఇంకా సమయం ఉండగానే ప్రత్యేకంగా ఓ వ్యూహకర్తను రంగంలోకి దింపేసింది. వచ్చే ఎన్నికలో పార్టీని అధికారంలోకి తేవటం కోసం చంద్రబాబునాయుడు గతంలోనే ఓ వ్యూహకర్త రాబిన్ శర్మతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఇపుడా రాబిన్ శర్మే తిరుపతిలో మకాం వేశారట.

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ సంస్ధలో చాలా కాలం పనిచేసిన రాబిన్ శర్మ కొత్తగా ‘షోటైమ్ కన్సల్టింగ్’ అనే సంస్ధను పెట్టుకున్నారు. దాని ద్వారా రాజకీయ పార్టీలకు అవసరమైన వ్యవహారాలను చక్క బెట్టటానికి పెద్ద బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి రాబిన్ తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇపుడా శర్మ బృందమే తిరుపతిలో మకాం వేసింది. తిరుపతి లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని నేతలతో టచ్ లోకి వెళుతోందని సమాచారం.

శర్మ బృందం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తు నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తోంది. పనిలో పనిగా రాజకీయాలతో సంబంధాలు లేని తటస్తులు, మామూలు జనాలతో కూడా చర్చిస్తోందని సమాచారం. వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన క్షేత్రస్ధాయిలోని సమాచారాన్ని, ప్రభుత్వంపై జనాబిప్రాయాన్ని సేకరిస్తోందట. జనాభిప్రాయానికి అనుగుణంగా ఎన్నికల్లో టీడీపీ అనుసరించాల్సిన వ్యూహాలపై శర్మ కసరత్తు చేస్తున్నారు.

తిరుపతి ఉపఎన్నికలో గెలుపును టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ గెలిస్తే పార్టీ నేతలకు, శ్రేణులకు మంచి ఊపునిస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఇక్కడ గనుక ఓడిపోతే పార్టీపై ఊహించని దెబ్బపడటం ఖాయం. అసలే కష్టాల్లో ఉన్న పార్టీ మీద మరింత దెబ్బపడితే తట్టుకోవటం కష్టం. అందుకనే అభ్యర్దిని ముందుగా ప్రకటించటం, నేతలతో వరుసగా చంద్రబాబు జూమ్ కాన్ఫరెన్సులతో మాట్లాడుతున్నారు. తాజాగా రాబిన్ బృందాన్ని కూడా రంగంలోకి దింపారు. పార్టీ గెలుపు కోసం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న చంద్రబాబుకు ఫలితం వస్తుందా ? అన్నది చూడాల్సిందే.