‘అందుకే ఎక్కువ మంది పిల్ల‌ల్ని క‌న‌మ‌ని చెబుతున్నా’

ప్రపంచంలోని ప‌లు దేశాల్లో వృద్ధ జ‌నాభా ఇప్పుడు పెను స‌వాలుగా మారుతోంద‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. మ‌న‌దేశం మాత్ర‌మే ప్ర‌స్తుతం యువత ఎక్కువ‌గా ఉంద‌న్నారు. అయితే వ‌చ్చే 20 ఏళ్ల త‌ర్వాత ఈ ప‌రిస్థితి కూడా తారుమార‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఎక్కువ మంది పిల్ల‌ల్ని క‌నాల‌ని పిలుపునిస్తున్న‌ట్టు చెప్పారు. వ‌యోజన జ‌నాభా స‌మ‌తుల్యం కావాలంటే ఇప్ప‌టి నుంచే సంతానోత్ప‌త్తిపై దృష్టి పెట్టాల‌న్నారు. అందుకే ఏపీలో మూడో బిడ్డ‌ను క‌నేవారికి ఆర్థిక సాయం చేస్తామ‌ని హామీ ఇచ్చిన విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు.

ఢిల్లీలో జరుగుతున్న ‘రైసినా డైలాగ్’ కార్య‌క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి 110 ప్ర‌పంచ దేశాల‌కు చెందిన ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో చంద్ర‌బాబు మాట్లాడుతూ ప్ర‌పంచ దేశాల అభివృద్ధి, ఆర్థిక వ్య‌వ‌హారాల్లో భార‌త దేశ ప్ర‌జ‌ల పాత్ర ఎంతో ఉంద‌న్నారు. ప్ర‌పంచంలో ఎక్క‌డికి వెళ్లినా ఏపీ స‌హా దేశ ప్ర‌జ‌లు క‌నిపిస్తార‌న్నారు. వారి ఆలోచ‌న‌లు ఎక్క‌డ ఉన్నా దేశానికి ప్ర‌యోజ‌నం క‌లిగించేలా, దేశం పేరును ప్ర‌పంచ వ్యాప్తంగా వినిపించేలా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. ఐటీ రంగంలో భార‌త పౌరుల దూకుడు ఎలాంటిదో అంద‌రికీ తెలిసిందేన‌న్నారు. ఇప్పుడు డిప్లొమ‌సీ, ఫ్లెక్సిబిలిటీల్లోనూ దూకుడుగా ఉన్నార‌ని తెలిపారు.

సంస్క‌ర‌ణ‌ల మంత్రం..

అన్ని రంగాల్లోనూ సంస్క‌ర‌ణ‌ల‌కు పెద్దపీట వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఇప్ప‌టికే చేప‌ట్టిన సంస్క‌ర‌ణ‌లు దేశాన్ని అభివృద్ధి ప‌థంలో ముందుకు తీసుకువెళ్తున్నాయ‌ని చెప్పారు. ఏపీలో తాము కూడా కేంద్ర ప్ర‌భుత్వం చేప‌డుతున్న సంస్క‌ర‌ణ‌ల‌తో పాటు సొంతంగా కూడా కొన్ని సంస్క‌ర‌ణ‌ల‌ను అమ‌లు చేస్తున్నామ‌న్నారు. దీనిలో భాగంగానే సంతానోత్ప‌త్తిపై ప్ర‌త్యేకంగా దృష్టి సారించామ‌ని చెప్పారు. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని సంస్క‌ర‌ణ‌లు తీసుకురానున్న‌ట్టు తెలిపారు.

ప్ర‌పంచానికే విద్యుత్..

ప్ర‌పంచ దేశాల‌కు సైతం భార‌త్ విద్యుత్‌ను విక్ర‌యించుకునే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. ఇది త్వ‌ర‌లోనే సాకారం అవుతుంద‌న్నారు. దీనికి విద్యుత్ రంగంలో తీసుకువ‌చ్చిన సంస్క‌ర‌ణ‌లే కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. ఇక ఏపీ రాజ‌ధాని అమ‌రావతి గురించి మాట్లాడుతూ ఇక్కడ సృజ‌నాత్మ‌క న‌గ‌రాన్ని నిర్మిస్తున్నామ‌న్నారు. అదేవిధంగా డ్రోన్ సిటీ, ఎల‌క్ట్రానిక్ న‌గ‌రాల‌ను కూడా నిర్మిస్తున్నామ‌ని, భ‌విష్య‌త్తు టెక్నాల‌జీలో అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయ‌ని వివ‌రించారు.