జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా ఒక నాయకుడు అంటూ.. ఆయన పేరు పెట్టి చెప్పకపోయినా.. ఇటీవల జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని.. అందరికీ ఒకేసారి ఒకేవేదికపై స్వీట్ సూచనలు చేశారు. ప్రధానంగా మాట జారొద్దన్నదే.. ఈ మొత్తం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. వాస్తవానికి.. గత ఏడాది కాలంగా కూడా.. ఇదే విషయాన్ని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం చెబుతున్నారు.
నాయకులు మాట్లాడేముందు.. ఆచితూచి మాట్లాడాలని చెబుతున్నారు. ముఖ్యంగా మీడియా ముందుకు వస్తున్నవారు.. ముందుగానే వర్కవుట్ చేసి రావాలని కూడా రెండు మూడు సందర్భాల్లో పవన్ చెప్పారు. అయినప్పటికీ.. చాలా మంది నాయకులు ఇంకా వర్కవుట్ చేయడం లేదు. పైగా ఆవేశం ప్రదర్శిస్తున్నారు. సెల్ఫీ వీడియోలు అయినా.. నేరుగా మీడియాలో మాట్లాడప్పుడు అయినా.. ఎంతో కొంత మేరకు సదరు సబ్జెక్టుపై వర్కవుట్ చేయాలని పవన్ కల్యాణ్ చెబుతున్నారు.
అంతేకాదు.. తాను కూడా ఏదైనా మాట్లాడేముందు.. ఒకటి రెండు సార్లు ప్రిపేర్ కూడా అవుతానని చెప్పారు. అయినప్పటికీ.. జనసేనలో కొందరు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. తర్వాత.. వీటిపై వివరణలు ఇచ్చుకునే పరిస్థితి వస్తోంది. ఈ పరిస్థితిని అరికట్టేందుకు.. పార్టీ పరంగా చర్యలు ప్రారంభించారు. మాట జారకుండా నాయకులు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఒకటికి రెండు సార్లు ఎంచుకున్న సబ్జెక్టుపైనే మాట్లాడేలా చూసుకోవాలని.. గాడి తప్పి.. ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చేలా వ్యవహరించవద్దని కూడా చెబుతున్నారు.
నిజానికి జనసేన పార్టీలో 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు. అయినప్పటికీ.. కేవలం ఓ నలుగురైదురుగురు మినహా ఎవరూ మీడియా ముందుకు రావడం లేదు. అయితే.. అలా వచ్చిన వారు కూడా.. వివాదాలకు దారి తీసేలా వ్యవహరిస్తున్నారన్నది పార్టీలో జరుగుతున్న చర్చ.
ఈ క్రమంలోనే అలాంటి నాయకులను అదుపు చేసేందుకు మాట తీరును సరిచేసుకునేందుకు.. పార్టీ పరంగా అన్ని విషయాలను గమనించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయి నాయకులకు ఏయే విషయాలపై ఎలా మాట్లాడాలన్న అంశంపై తర్ఫీదు ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఈ శిక్షణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates