‘సుబ్బారెడ్డిని అరెస్టు చేయాలి…’ స‌ర్కారుపై ఒత్తిడి

తిరుమ‌ల శ్రీవారి ప‌విత్ర ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగం వ్య‌వ‌హారంలో కీల‌క మ‌లుపు చోటు చేసుకుంది. టీడీపీ నేత‌ల ఆధ్వ‌ర్యంలో ప‌లు జిల్లాల్లో సోమ‌వారం.. నిర‌స‌న కార్య‌క్ర‌మాలు జోరుగా సాగాయి. ఈ కేసులో త‌ప్పు ఒప్పుకొన్న టీటీడీ మాజీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డిని త‌క్ష‌ణ‌మే అరెస్టు చేయాలంటూ.. పెద్ద ఎత్తున నాయ‌కులు నిన‌దించారు.

రెండు రోజుల కింద‌ట ఢిల్లీలో మీడియా స‌మావేశం నిర్వ‌హించిన వైవీ సుబ్బారెడ్డి.. క‌ల్తీ జ‌రిగిన మాట వాస్త‌వ‌మేన‌ని.. త‌న‌కు కూడా నివేదిక‌లు వ‌చ్చాయ‌ని.. కానీ, అధికారులు కొంద‌రు ఆ త‌ర్వాత ఏమైందో త‌న‌కు చెప్ప‌లేద‌న్నారు. దీంతో త‌న‌కు కూడా తెలియ‌కుండానే `విష‌యం` జ‌రిగిపోయింద‌న్నారు.

అంతేకాదు..క‌ల్తీ జ‌రిగిన విష‌యం త‌న‌కు కూడా తెలుసున‌ని.. అయితే.. జంతువుల కొవ్వు కాద‌న్న ఆయ‌న‌.. పామాయిల్ వంటి ప‌దార్థాలు క‌లిశాయ‌ని చెప్పారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో టీడీపీ నాయ‌కులు రియాక్ట్‌ అయ్యారు. సుబ్బారెడ్డిని అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

ఇక‌, టీటీడీలో ప‌నిచేసిన స‌మ‌యంలో లెట‌ర్ హెడ్‌పై ఇచ్చిన ఫోన్ నెంబ‌రు, 2018, మార్చి 15న ట్వీట్ చేసిన వైవీ లెటర్‌హెడ్‌పై చిన్నప్పన్న నంబర్‌ 9542419999 ఒక్క‌టేన‌ని ప‌లువురు నేత‌లు తెలిపారు. తప్పులపై తప్పులు బయటపడ్డా మారని వైసీపీ తీరు అబద్దాలు, అసత్యాలతో ఫేక్ ప్రచారాలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

అరెస్టు చేస్తారా?

రాష్ట్ర వ్యాప్తంగా వైవీ సుబ్బారెడ్డిని అరెస్టు చేయాల‌న్న డిమాండ్ పెరుగుతున్న నేప‌థ్యంలో ఆయ‌న‌ను అరెస్టు చేసే అవ‌కాశం ఉందా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. అయితే.. సీబీఐ ఆధ్వ‌ర్యంలోని ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం ఈ కేసును విచారించినా.. చార్జిషీట్‌లో వైవీ పేరును పేర్కొన‌లేదు. దీనికితోడు కేసు విచార‌ణ ప‌రిధిలోనే ఉంది. దీనిపై నెల్లూరు కోర్టు విచార‌ణ చేస్తోంది.

ఈ కేసు విచార‌ణ జ‌రిగిన అనంత‌రం.. అప్పుడు ప్ర‌భుత్వం ఇంప్లీడ్ అయితే.. వైవీ పేరు ప్ర‌స్తావ‌న‌కు రావొచ్చు. లేదా.. సుప్రీంకోర్టు వ‌ర‌కు వెళ్లే అవ‌కాశం ఉంది. ఇవ‌న్నీపూర్తి కావాలి. అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వం ఏక‌స‌భ్య క‌మిష‌న్ వేస్తాన‌ని చెబుతోంది. ఈ క‌మిష‌న్ రిపోర్టు వ‌చ్చాక కానీ.. వైవీపై చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.