తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన కల్తీ నెయ్యిపై సీఎం చంద్రబాబు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆ లడ్డూలో వినియోగించిన నెయ్యిలో మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు ఉపయోగించే రసాయనాలు వాడారని ఆయన తెలిపారు. ఇది భక్తుల మనో విశ్వాసాలతోనే కాదు, తిరుమల శ్రీవారి పవిత్రతతో కూడా ఆడుకోవడం కాదా అని వైసీపీ నాయకులను ఉద్దేశించి చంద్రబాబు ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని వెలికి తీస్తుంటే వైసీపీ నాయకులు ఎదురు దాడి చేస్తున్నారని నిప్పులు చెరిగారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో శుక్రవారం సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ‘మీ భూమి మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని పలువురికి పట్టా పుస్తకాలను అందించారు. అనంతరం మాట్లాడుతూ తిరుమల శ్రీవారి లడ్డూలో వినియోగించిన నెయ్యిపై వైసీపీ ఎదురు దాడి చేస్తోందని తెలిపారు. ఇప్పటికే నియమించిన కమిటీ కల్తీ జరిగినట్టు స్పష్టంగా చెప్పినా, ఏమీ జరగలేదని పేర్కొంటూ క్లీన్ చిట్ ఇచ్చారనే ప్రచారం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
ప్రశ్నిస్తే తమపై దాడులు చేస్తున్నారని సీఎం తెలిపారు. ఒక్క తిరుమల శ్రీవారి లడ్డూలోనే కాకుండా శ్రీశైలం మల్లన్న ఆలయంలో భక్తులకు ఇచ్చే ప్రసాదంలో కూడా కల్తీ నెయ్యి వాడినట్టు తనకు నివేదికలు అందాయని చంద్రబాబు చెప్పారు. వెంటనే సంబంధిత అధికారులను బదిలీ చేశామని, ఆలయాల పవిత్రతను కాపాడుతున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తిరుమల, శ్రీశైలం లడ్డూ ప్రసాదాలు ఎంతో రుచిగా, పవిత్రంగా ఉన్నాయని భక్తులే చెబుతున్నారని పేర్కొన్నారు.
ఇక పాస్ బుక్స్ ద్వారా రైతులకు, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. గతంలో భూములు ఒకరి వాటిని మరొకరు ఆక్రమించుకునే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా చేశామని చెప్పారు. ఎవరి ఫోన్లలో వారు తమ భూముల వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకునే అవకాశం కల్పించామని తెలిపారు. దీనివల్ల రైతులకు, ప్రజలకు భూ కబ్జా సమస్యలు తగ్గుతాయని అన్నారు. అదే సమయంలో లంచాల వ్యవస్థకు కూడా పూర్తిగా అడ్డుకట్ట వేశామని చంద్రబాబు పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
