ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు.. అసలు వైసీపీ వ్యవహార శైలి ఎలా ఉంటుంది? హిందూ ధర్మం, ఆలయాల విషయంలో ఆ పార్టీ అనుసరిస్తున్న తీరు ఎలా ఉంది? అనేది ఆయన వివరించారు. పాయింట్ల వారీగా చూస్తే సీఎం చంద్రబాబు లేవనెత్తిన అనేక అంశాలు వైసీపీని అత్యంత ఇరుకున పెట్టే అంశాలుగా మారాయి.

ప్రధానంగా:

1) అంతర్వేది:
వైసీపీ హయాంలో అంతర్వేదిలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి చెందిన రథం దగ్ధమైంది. ఈ విషయాన్ని సీఎం ప్రస్తావించారు. నాడు వైసీపీ నేతలు ఈ విచారణకు కూడా అడ్డుపడ్డారని, సీబీఐకి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా తప్పించుకున్నారని అన్నారు. పైగా తేనెతుట్టెకు పొగ పెట్టడం వల్లే మంటలు వ్యాపించాయని, అందుకే రథం తగలబడిందని చెప్పారని తెలిపారు. దీంతో ఇప్పుడు వైసీపీ ఈ విషయంపై గతంలో ఏమి చేసిందన్నది చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.

2) అనంతపురం ఘటన:
వైసీపీ హయాంలో అనంతపురం జిల్లాలో ఆంజనేయుడి విగ్రహాన్ని పగలగొట్టారు. దీనిపైనా పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. అయితే అప్పట్లో వైసీపీ నాయకులు లైట్ తీసుకున్నారు. “అదో బొమ్మే కదా, ఇంకోటి పెట్టుకోండి” అని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని కూడా ప్రజల్లోకి చంద్రబాబు తీసుకువెళ్లనున్నారు. దీనిపై కూడా వైసీపీ అంతర్మథనంలో పడే అవకాశం కనిపిస్తోంది.

3) రామతీర్థం:
విజయనగరం జిల్లా రామతీర్థంలోని శ్రీరాముడి విగ్రహం శిరఛ్ఛేదనం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. హుటాహుటిన కొత్త విగ్రహం ప్రతిష్ఠించినా, ఆనాడు ఈ ఘటనపై వైసీపీ పాలకులు మసిపూసి మారేడు చేశారన్న వాదన ఉంది. అందుకే ఇప్పుడు మళ్లీ ఈ విషయాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్లనున్నారు. దీనిపై కూడా వైసీపీ ఇరుకున పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

4) బెజవాడ దుర్గమ్మ:
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయ రథంలో ఉన్న వెండి సింహాలను దొంగిలించారు. ఈ వ్యవహారంపైనా వైసీపీ నాయకులు తూతూ మంత్రంగా విచారణ చేయించారని ఆరోపణ ఉంది. దీనిపైనా ఇప్పుడు కూటమి ప్రజల్లో ఎండగట్టనుంది. దీనికి వైసీపీ నాయకులు ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.

5) తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ:
ప్రధానంగా తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారానికి సంబంధించి 2022లోనే గత వైసీపీ ప్రభుత్వానికి నివేదిక అందిందని చెబుతున్నారు. సీఎఫ్టీఆర్ఐ ఇచ్చిన నివేదికలో నెయ్యి కల్తీ జరుగుతోందని స్పష్టంగా ఉందని అంటున్నారు. కానీ ఆ నివేదికను అప్పట్లో పక్కన పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కూడా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లనున్నారు. అప్పట్లో ఏమి జరిగింది? ఎందుకు చర్యలు తీసుకోలేదు? అనే ప్రశ్నలకు వైసీపీ సమాధానం ఇవ్వాల్సి ఉంది. కానీ అలాంటి ప్రశ్నలకు ఆ పార్టీ వద్ద సమాధానం ఉందా? అనేది చర్చనీయాంశంగా మారింది.