వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన.. బడ్జెట్ సమావేశాలపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు అత్యంత విశ్వసనీయ నాయకుడి ద్వారా తెలిసింది. తాడేపల్లి కేంద్ర కార్యాలయం వ్యవహారాలు చూసే ఓ కీలక నాయకుడు, ప్రజాప్రతినిధి ఆఫ్ దిరికార్డుగా ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
తొలిరోజు గవర్నర్ ప్రసంగంతో సభలు ప్రారంభం అవుతాయి. అనంతరం.. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. ఫిబ్రవరి 14న వార్షిక(2026-27) బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత కీలకంగా మారనున్నాయి. వచ్చే ఏడాదికి ఎన్నికలు సమీపించే ఏడాది.. నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్లోనే ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్నారు. అదేసమయంలో కీలక ప్రాజెక్టులకు కూడా నిధులు కేటాయించనున్నారు.
అయితే… అసెంబ్లీ సమావేశాలు అనగానే.. సహజంగానే వైసీపీవైపు అందరి దృష్టీ ఉంటుంది. గత 18 మాసాల్లో వైసీపీ నాయకులు సభకు రావడం లేదు. తొలిసారి శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సభకు వచ్చారు. తర్వాత.. 2025-26 బడ్జెట్ సమావేశాల తొలిరోజు.. గవర్నర్ ప్రసంగానికి జగన్ తన ఎమ్మెల్యేలతో హాజరయ్యారు.
అయితే.. అప్పట్లో వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని.. ఉద్దేశ పూర్వకంగానే తమ వారిపై దాడులు చేస్తున్నారని ఆరోపిస్తూ.. నల్లకండువాలతో జగన్ సభకు వచ్చారు. అనంతరం.. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ప్రసంగ ప్రతులను చింపి పోసి.. సభనుంచి బయటకు వెళ్లిపోయారు.
దరిమిలా.. ఇప్పటి వరకు జగన్ సభకు హాజరు కాలేదు. అయితే.. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండానే జీతాలు తీసుకుంటున్నారని, భత్యాలకు దరఖాస్తు చేస్తున్నారని.. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సభకు రాని సభ్యులకు వేతనాల్లో కోత పెట్టేలా.. వారిని అనర్హులుగా ప్రకటించేలా కూడా చేయాలన్నది సభ ఉద్దేశం.
ఈ చర్చ ఒకవైపు సాగుతున్న క్రమంలోనే తాజాగా బడ్జెట్ సమావేశాలకు రావాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. తొలిరోజు గవర్నర్ ప్రసంగానికి హాజరు కావాలని.. తమ నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించినట్టు.. కీలక నేత ద్వారా తెలిసింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates