మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్లో పలు పిల్లర్లు కుంగిన వైనం తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. 2023 ఎన్నికలకు ముందు చెలరేగిన రాజకీయ దుమారం ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై ప్రభావం చూపింది. పిల్లర్లు కుంగడానికి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తే కారణమంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సర్కార్ నియమించిన కమిషన్ నివేదిక కూడా ఇచ్చింది. అయితే, బాంబుతో మేడిగడ్డ చెక్ డ్యామ్ ను పేల్చేశారని, అదే పిల్లర్లు కృంగడానికి కారణమని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ క్రమంలోనే నేడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
తన నియోజకవర్గంలోని తనుగుల చెక్డ్యామ్ను బాంబు పెట్టి పేల్చివేశారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ మాదిరిగానే చెక్డ్యామ్ను బాంబు పెట్టి పేల్చేశారని ఆయన చేసిన ఆరోపణలు సభలో దుమారం రేపాయి. అయితే, కౌశిక్ రెడ్డి ఆరోపణలను కాంగ్రెస్ సభ్యులు ఖండించారు.
బాంబులు పెట్టి పేల్చారని ఆరోపణలు చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలంటూ స్పీకర్ను కాంగ్రెస్ సభ్యుడు నాగరాజు కోరారు. ఏది ఏమైనా సభలో కౌశిక్ రెడ్డి చేసిన బాంబు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates