చంద్రబాబు గ్రాఫ్.. 2025లో ఎలా ఉందంటే..!

ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు ఈ ఏడాది కీలక సంవత్సరం అనే చెప్పాలి. గత ఏడాది జూన్‌లో బాధ్యతలు చేపట్టినప్పటికీ, అప్పటికే ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టడం, ప్రభుత్వ విధానాలను సమన్వయం చేయటం, అధికారుల బదిలీలు వంటి అనేక ఇబ్బందులు, సమస్యలు ఎదురయ్యాయి.

ఈ ఏడాది పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వాన్ని తన అధీనంలోకి తీసుకోగలిగారు. రాష్ట్రానికి సంబంధించిన పూర్తి అవగాహనను పెంచుకున్నారు. ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగిన వ్యవహారాలు, అప్పులు వంటి అంశాలను సమీక్షించడంతోపాటు అమరావతి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేశారు.

మరీ ముఖ్యంగా పెట్టుబడుల సాకారానికి ఈ ఏడాది జనవరి నుంచి గత నెల వరకు కూడా సీఎం చంద్రబాబు పలు దేశాల్లో పర్యటించారు. స్విట్జర్లాండ్, సింగపూర్, బ్రిటన్, దుబాయ్ సహా అనేక దేశాల్లో పర్యటించిన ఆయన పెట్టుబడులను తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. విశాఖలో నిర్వహించిన సీఐఐ సదస్సు ఈ పెట్టుబడులకు మరింత ఊతాన్ని కల్పించింది.

ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు గూగుల్ డేటా సెంటర్‌ను తీసుకురావడంలో సీఎం చంద్రబాబు తన రాజకీయ చతురతను ప్రదర్శించి విజయం సాధించారు.

అదేవిధంగా ఉపాధి, ఉద్యోగాల కల్పన విషయంలో కూడా చంద్రబాబు తన ఇమేజ్‌ను మరింత పెంచుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే, గతానికి భిన్నంగా ఈ ఏడాది సీఎం చంద్రబాబు వ్యవహరించారనే చెప్పాలి. గతంలో పార్టీ నాయకుల్లో విభేదాలు వస్తే వెంటనే చర్యలు తీసుకునే పరిస్థితి ఉండగా, ఇప్పుడు ఆచితూచి అడుగులు వేసే దిశగా నడిచారు.

దీంతో వివాదాలకు కేంద్రంగా మారిన వారు తమంత తాము సర్దుకునేలా చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు.

మరోవైపు, ప్రజల సంక్షేమం, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా ప్రభుత్వంపై పాజిటివిటీని పెంచే దిశగా కూడా చంద్రబాబు అడుగులు వేశారు.

మొత్తంగా ఈ ఏడాది సీఎంగా చంద్రబాబు తన గ్రాఫ్‌ను పెంచుకోవడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందారు. అనేక సంస్థలు చంద్రబాబును చూసి పెట్టుబడులు పెడుతున్నామని చెప్పడం ద్వారా ఆయన తన ఇమేజ్‌ను నిలబెట్టుకున్నారు. ఇటీవల ఎకనామిక్ టైమ్స్ చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ – 2025 అవార్డును ప్రకటించింది.

మొత్తం మీద 2025లో సీఎంగా చంద్రబాబు తన గ్రాఫ్‌ను స్పష్టంగా పెంచుకున్నారు.