రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీనిని ఏం చేయాల‌న్న అంశంపై కొన్నాళ్లుగా ప్ర‌భుత్వం అంత‌ర్మ‌థ‌నం చెందుతోంది. ఈ క్ర‌మంలో మంత్రి కందుల దుర్గేష్‌ నేతృత్వంలో ప్ర‌భుత్వం క‌మిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గ‌త రెండు మాసాలుగా అధ్య‌య‌నం చేసింది. ఈ అధ్య‌య‌నంలో ప్ర‌జ‌ల నుంచి మేధావుల దాకా అంద‌రి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

ఇదేస‌మ‌యంలో ఇటీవ‌ల జ‌రిగిన పెట్టుబ‌డుల స‌ద‌స్సులోనూ ఈ వ్య‌వ‌హారంపై చ‌ర్చించారు. దీంతో తాజాగా జ‌రిగిన క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో దీనికి సంబంధించి సీఎం చంద్ర‌బాబుకు నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక‌లో కీల‌క అంశాల ప్ర‌కారం.. టాటా స‌హా ప‌లు పెట్టుబ‌డి దారీ సంస్థ‌లు.. రుషికొండ ప్యాలెస్‌ను లీజుకు తీసుకునేందుకు ముందుకు వ‌చ్చాయి. వీటిలో అంతర్జాతీయ సంస్థ‌లు కూడా ఉన్నాయ‌ని మంత్రులు ముఖ్య‌మంత్రి కి చెప్పారు.

రామోజీ గ్రూపు సంస్థ‌లైన డాల్ఫిన్ హోట‌ల్స్ కూడా.. రుషికొండ ప్యాలెస్‌ను లీజుకు తీసుకునేందుకు ముందుకు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. దీంతో ఈ వ్య‌వ‌హారాన్ని ఈ నెల చివ‌రిలో లేదా.. జ‌న‌వ‌రి రెండో వారం నాటికి ఒక‌నిర్ణ‌యం తీసుకుంటార‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఏటా 5 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు లీజు ఇచ్చేందుకు టాటా సంస్థ ముందుకు వ‌చ్చిన‌ట్టు తెలిపాయి. దీనిలో హోట‌ల్ ఏర్పాటు చేయ‌డం ద్వారా.. విశాఖ‌లో పెరుగుతున్న ఐటీ ప‌రిశ్ర‌మ‌ల ద్వారా.. ప్రాధాన్యం క‌ల్పించ‌నున్న‌ట్టు స‌మాచారం.

ఇదేజ‌రిగితే.. ఇప్ప‌టి వ‌ర‌కు వృథాగా ప‌డి ఉన్న రుషి కొండ ప్యాలెస్‌ను వినియోగంలోకి తీసుకువ‌చ్చిన‌ట్టు అవుతుంది. ఇదేస‌మ‌యంలో ప్ర‌భుత్వానికి ఆదాయం కూడా స‌మ‌కూర‌నుంది. అయితే.. ప్ర‌భుత్వం చెబుతున్న‌ట్టు 550 కోట్ల రూపాయ‌లు వెచ్చించి నిర్మించిన ఈ భ‌వ‌నానికి ఏటా 5 కోట్ల రూపాయ‌లు అంటే.. త‌క్కువ‌నే వాద‌న వినిపిస్తున్నా.. టాటాలు ఒక్క‌రే ఈ మొత్తాన్ని వెచ్చించేందుకు ముందుకు వ‌చ్చార‌ని.. మిగిలిన సంస్థ‌లు ఇంత‌క‌న్నా త‌క్కువ‌కే కోరుతున్న‌ట్టు మ‌రో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏదేమైనా.. ప్ర‌స్తుతం రుషికొండ ప్యాలెస్ వ్య‌వ‌హారం.. కొలిక్కి వ‌చ్చిన‌ట్టేన‌ని అంటున్నారు.