రాజాసింగ్ చెప్పిందే నిజమైందా?

“తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? ఎందుకు మనం నానాటికీ దిగజారుతున్నాం.” ఇదీ ప్రధాని నరేంద్ర మోడీ సంధించిన ప్రశ్న. దీనికి బీజేపీ ఎంపీల దగ్గర సమాధానం లేకుండాపోయింది. కేవలం ఒకరిద్దరు నాయకుల మధ్య బంధీ అయిన అధికారం ఆధిపత్యం కారణంగానే తెలంగాణలో బీజేపీ నానాటికీ తీసికట్టుగా మారుతోందన్నది నిజం. ఎవరికివారు పెద్దలుగా మారి పార్టీ లైన్‌ను విస్మరించిన ఫలితంగానే ప్రజలకు చేరువ కావాల్సిన పార్టీ జారుబండిపై ప్రయోగాలు చేస్తోంది.

ఈ విషయాన్ని ఎవరికైనా ఇష్టం ఉన్నా కష్టంగా అనిపించినా ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గత ఆరు నెలల క్రితమే చెప్పారు. పార్టీని సంస్కరించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పారు. అయితే ఆయన మాటలను ఎవరూ పట్టించుకోలేదు. పైగా ఆయనను బయటకు వెళ్లేలా చేశారన్న వాదన కూడా ఉంది. కానీ ప్రస్తుతం ప్రధాని వరకూ రాష్ట్ర రాజకీయాలు చేరి ప్రశ్నలు తలెత్తే దాకా రావడం వెనుక ఎవరు ఉన్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా మారింది.

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని భావించిన పార్టీ ఆ దిశగా అడుగులు వేయడంలో తడబడుతోందన్నది స్పష్టంగా కనిపిస్తోంది. బండి సంజయ్ పార్టీ చీఫ్‌గా ఉన్నప్పుడు ఉన్న వేగం మరియు రాజకీయ దూకుడు ఇప్పుడు కనిపించడంలేదు. పార్టీ అధిష్టానం చీఫ్‌ను మార్చినా తెర వెనుక సాగుతున్న ఆధిపత్య రాజకీయాలను మాత్రం తగ్గించలేకపోయింది. ఒకరంటే ఒకరికి పడదు. ఒకరి నిర్ణయాలను మరొకరు అనుసరించే పరిస్థితి కూడా లేదు. కిషన్ రెడ్డితో కొందరికి పడదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈటల రాజేందర్, బండి సంజయ్, మాధవీలత, కిషన్ రెడ్డి వంటి కొద్దిమంది మాత్రమే బీజేపీలో నాయకత్వంగా ముందుకు వస్తున్నారు. క్షేత్రస్థాయి కమిటీల ఏర్పాటు మరియు నాయకులను సమన్వయం చేయడంలో విఫలమవడం పార్టీకి నష్టాలుగా మారుతోంది. ఈ కారణంగానే పార్టీ దెబ్బతింటోందన్న వాదన నిజమే. ఇదే విషయాన్ని అప్పుడే రాజాసింగ్ చెప్పారు. ఒక్కరికోసం పార్టీనా లేక అందరికోసం పార్టీనా అని ప్రశ్నించారు. అప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ విషయం ప్రధాని దాకా చేరే వరకు నాయకులు ఏం చేశారన్నది ప్రశ్నగా మారింది.

ఇప్పటికైనా పార్టీ మార్పు దిశగా అడుగులు వేస్తారా లేదా అనేది చూడాలి.