పవన్ చెప్పే స‌నాత‌న ధ‌ర్మ బోర్డు.. ప్రభుత్వం స్థాపించగలదా?

“స‌నాత‌న ధ‌ర్మ బోర్డును సాధ్య‌మైనంత వేగంగా ఏర్పాటు చేయాలి.“ తాజాగా జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి చెప్పిన మాట‌. త‌మిళ‌నాడులో జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌ను తాజాగా ప్ర‌స్తావించిన ఆయ‌న‌.. ఈ విష‌యాన్ని మ‌రోసారి తెర‌మీదికి తెచ్చారు. స‌నాత‌న ధ‌ర్మ బోర్డును ఏర్పాటు చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. స‌నాత‌న ధ‌ర్మాన్ని, దీనికి మ‌ద్ద‌తు ఇచ్చేవారిని.. అదేవిధంగా స‌నాత‌న ధ‌ర్మాన్ని పాటించేవారిని కూడా కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు.

అంతేకాదు.. స‌నాత‌న ధ‌ర్మ బోర్డు ఏర్పాటు చేస్తే.. అప్పుడు హిందువుల‌కు మ‌రింత ర‌క్ష‌ణ ఏర్ప‌డుతుందని, ఆల‌యాల‌కు కూడా మ‌రింత భ‌ద్ర‌త క‌లుగుతుంద‌న్న‌ది ప‌వ‌న్ క‌ల్యాణ్ చెబుతున్న మాట‌. అయితే.. ఈ బోర్డు ప్ర‌తిపాద‌న ఇప్పుడే కాదు.. ఈ ఏడాది ప్రారంభంలో తిరుమ‌ల శ్రీవారి ప్ర‌సాదం ల‌డ్డూలో వినియోగించే నెయ్యిని క‌ల్తీ చేశార‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చిన‌ప్పుడు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌నాత‌న ధ‌ర్మ దీక్ష తీసుకున్నారు. ఆ స‌మ‌యంలోనే తొలిసారి స‌నాత‌న ధ‌ర్మ బోర్డును ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు.

ఎవ‌రు చేయాలి..?

ఇక‌, ప‌వ‌న్ కల్యాణ్ చెబుతున్న సనాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ బోర్డును ఎవ‌రు చేయాలి? అనేది ప్రశ్న‌. ఒక మ‌తాన్ని ప‌రిర‌క్షించ‌డం.. లేదా.. మ‌తాన్ని అనుస‌రించ‌డం.. అనేది ప్ర‌భుత్వాల విధికాదు. రాజ్యాంగంలో ని ఆర్టిక‌ల్ 22 ఇదే విష‌యాన్ని చెబుతోంది. ప్ర‌భుత్వానికి మ‌తం లేదు. కేవ‌లం చ‌ట్టం ప్ర‌కారం.. రాజ్యాంగం ప్ర‌కారం న‌డుచుకోవాల‌ని మాత్ర‌మే చెబుతోంది. ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే త‌మ ఇష్ట ప్ర‌కారం.. మ‌తాన్ని అనుస‌రించే హ‌క్కు ఉంద‌ని.. ఆ హ‌క్కును మాత్ర‌మే ప్ర‌భుత్వాలు కాపాడాల‌ని రాజ్యాంగం స్ప‌ష్టం చేసింది. సో.. దీనిని బ‌ట్టి.. ప్ర‌భుత్వాలు బోర్డును ఏర్పాటు చేసే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు.

మ‌రి దారేదీ..?

ప్ర‌స్తుతం కులాలు, మ‌తాలకు బోర్డులు.. ఆయా మ‌తాలు స్వయంగా ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఉదాహర‌ణ‌కు ముస్లింల‌కు మాత్ర‌మే మ‌న దేశంలో బోర్డు ఉంది. అది కూడా.. వ‌క్ఫ్ బోర్డు. అంటే.. వార‌స‌త్వంగా ముస్లింల‌కు వ‌చ్చిన భూముల‌ను మాత్ర‌మే ప‌రిర‌క్షించుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.. త‌ప్ప‌.. మ‌తాన్ని కాదు. ఇక‌, క్రిస్టియానిటీకి కూడా బోర్డులేదు. అయితే.. స‌నాత‌న ధ‌ర్మం.. విల‌సిల్లిన దేశం కాబ‌ట్టి.. దీనికి ప్ర‌త్యేకంగా బోర్డు ఉండాల‌న్న నినాదం ఇప్ప‌టిది కూడా కాదు.

గ‌తంలో ఆర్ ఎస్ ఎస్ ప్ర‌ముఖులుగా.. అయోధ్య రామాల‌యం కోసం ఉద్య‌మించి వంద‌ల మంది కూడా ఇదే ఆలోచ‌న చేశారు. కానీ, రాజ్యాంగం అనుమ‌తించ‌దు. దీనికి మ‌రో కార‌ణం.. రాజ్యాంగ పీఠిక‌లోనే.. “లౌకిక‌“ అనే ప‌దం చేర్చారు. సో.. ప‌వ‌న్ ఆశ‌లు, ఆశ‌యాలు బాగానే ఉన్నా… బోర్డు ఏర్పాటు అనేది సాధ్యం కాక‌పోవ‌చ్చున‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.