కాంగ్రెస్ : రెండు తెలుగు రాష్ట్రాలకు చెడ్డ రేవడి

కాంగ్రెస్ పరిస్ధితి చూస్తుంటే అందరికీ జాలిగా ఉంది. ఎలాంటి పార్టీ చివరకు ఎలాగైపోయిందన్నదే అందరినీ బాధిస్తోంది. మిగిలిన దేశమంతా పక్కన పెట్టేసినా సమైక్య రాష్ట్రంలో మాత్రం ఎంతగా వెలిగిపోయింది 2004-14 మధ్య. అంతకుముందు కూడా ఒకసారి ఓడి, మరోసారి గెలుస్తునే ఉన్నది. ఓడినా కూడా పార్టీ మాత్రం చాలా బలంగానే ఉండేది. అలాంటి పార్టీ ఇపుడు విజయాల కోసం టార్చి వేసి వెతికినా కనబడటం లేదు. పార్టీ ప్రస్తుత పరిస్దితికి రాష్ట్ర విభజనే ప్రధాన కారణమని చెప్పకతప్పదు.

ప్రత్యేక తెలంగాణా కావాలని తెలంగాణాలోను రాష్ట్ర విభజన వద్దని సీమాంధ్రలోను ఉద్యమాలు జరిగిన విషయం తెలిసిందే. మామూలుగా అయితే మెజారిటి మనోభావాల ప్రకారమే నడుచుకోవాలి. కానీ ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం మెజారిటి మనోభావాలను పక్కన పెట్టేసి రాష్ట్ర విభజన చేసేసింది. పోనీ విభజన చేసిందే అనుకుందాం. చేసిన విభజన ఎలాగుండాలి ? మెజారిటి జనాలు సంతృప్తి పడేవిధంగా ఉండాలి. అంటే సీమాంధ్రకు హైదరాబాద్ ను రాజధానిగా ఇచ్చేసుంటే బాగుండేది. ఉమ్మడి రాజధానిగా చేసినా, కేంద్ర పాలిత ప్రాంతం చేసినా బాగుండేది. అలా కాకుండా అడ్డుగోలు విభజన చేసేసింది.

విభజన జరిగిన తీరు చూస్తే సీమాంధ్రపై అప్పటి కేంద్రప్రభుత్వం పగపట్టినట్లుగా చేసేసింది. హైదరాబాద్ తో కూడిన తెలంగాణాను ఇచ్చేసింది. ఆస్తులన్నింటినీ తెలంగాణాకు అప్పులను మాత్రం ఏపికి ఇచ్చింది. దేశచరిత్రలో ప్రత్యేక రాష్ట్రం కావాలని చేసిన డిమాండ్ కు తగ్గట్లే రాష్ట్రాలు ఇచ్చినా వాళ్ళని ప్రత్యేక రాజధాని ఏర్పాటు చేసుకోమన్నారు. కొత్తగా ఏర్పడిన ఛత్తీస్ ఘర్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు కొత్తగా రాజధానిని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. మరి ఏపి విషయంలో మాత్రం అప్పటి యూపీఏ ప్రభుత్వం ఉల్టాగా ఎందుకు చేసింది ?

విభజన, విభజన జరిగిన తీరుతోను మండిపోయిన జనాలు ఏపిలో కాంగ్రెస్ పార్టీకి ఘోరీ కట్టేశారు. 2014 ఎన్నికల్లో ఒక్క సీటులో కూడా గెలిపించటం కాదు కదా చాలా చోట్ల కనీసం డిపాజిట్లు కూడా ఇవ్వలేదు. అలాగే 2019 ఎన్నికల్లో కూడా హస్తంపార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే జనాల్లో అంతగా మంట మండిపోతోంది. సమీప భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు ఇస్తారనే నమ్మకం ఎవరిలోను కలగటం లేదు. ఇక్కడే అందరికీ కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది.

మెజారిటి మనోభవాలకు విలువ ఇవ్వకుండా రాష్ట్ర విభజన చేసింది కాబట్టి ఏపిలో కాంగ్రెస్ అంటే మండిపోతున్నారు. మరి తెలంగాణాలో ఏమైంది ? తెలంగాణాలో జనాలంతా ప్రత్యేక రాష్ట్రం కావాలనే కోరుకుంటున్నారంటూ అప్పట్లో కాంగ్రెస్ మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు సీనియర్ నేతలు కూడా ఒకటే ఊదరగొట్టారు కదా. జనాలడిగినట్లుగా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినందుకు ఇక్కడ పార్టీని నెత్తిన పెట్టుకోవాలి కదా ? మరెందుకు గెలిపించటం లేదు. రెండు వరుస ఎన్నికల్లోను పెద్దగా సీట్లివ్వలేదు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా మొన్న ఇద్దరినే గెలిపించారు.

తెలంగాణా ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ అంటే జనాలకు కృతజ్ఞత కూడా ఉన్నట్లు లేదు. తాజా గ్రేటర్ ఎన్నికల్లో కేవలం రెండంటే రెండు డివిజన్లలో మాత్రమే గెలిపించారు. అంటే రాష్ట్ర విభజన చేసినందుకు ఏపిలో చెంపదెబ్బ తెలంగాణాలో గోడదెబ్బ లాగ తయారైందన్నమాట.