ఢిల్లీలో గెలిచారు, బీహార్లో స్వీప్ చేశారు.. ఇప్పుడు బీజేపీ నెక్స్ట్ టార్గెట్ వెస్ట్ బెంగాల్. వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం కమలం పార్టీ పక్కా ప్లాన్తో రెడీ అవుతోంది. బీహార్లో వర్కవుట్ అయిన ఫార్ములాను బెంగాల్లో ఇంప్లిమెంట్ చేసి మమతా బెనర్జీ (దీదీ) కోటను బద్దలు కొట్టాలని డిసైడ్ అయ్యారు. ఈసారి బీజేపీ స్ట్రాటజీ పూర్తిగా మారింది. వారి టార్గెట్ మమత కాదు, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, అలాగే ఆయనపై అసంతృప్తిగా ఉన్న తృణమూల్ కేడర్.
ఈసారి బీజేపీ కింద నుంచి పైకి అనేలా స్కెచ్ వేస్తోంది. కేవలం పెద్ద లీడర్లను లాక్కోవడం కాకుండా, గ్రౌండ్ లెవల్లో ఉన్న తృణమూల్ కార్యకర్తలను ఆకర్షించడంపై ఫోకస్ పెట్టారు. అభిషేక్ బెనర్జీ నాయకత్వంపై నమ్మకం లేని, పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న వర్కర్లే బీజేపీ మెయిన్ టార్గెట్ అని తెలుస్తోంది. వీరిని లాక్కుంటే తృణమూల్ పునాదులు కదులుతాయని బీజేపీ నమ్ముతోంది.
అంతేకాదు, బెంగాల్లో ఎప్పుడూ లేని ‘కుటుంబ రాజకీయాల’ అంశాన్ని తెరపైకి తెచ్చి, అభిషేక్ను దీదీ వారసుడిగా రుద్దడాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు. కాంగ్రెస్పై వాడిన అదే అస్త్రాన్ని ఇప్పుడు దీదీపై ఎక్కుపెట్టారు. గత ఎన్నికల్లో సువేందు అధికారి వంటి పెద్ద నేతలను చేర్చుకున్నా, ఈసారి మాత్రం ఇతర పార్టీల లీడర్లను చేర్చుకునే ఆలోచనలో బీజేపీ లేదు. వారి వల్ల ఓట్లు పెరగకపోగా, పార్టీలో అసంతృప్తి పెరుగుతుందని భావిస్తోంది. అందుకే కార్యకర్తలను పెంచుకుని, తమ క్యాడర్ను స్ట్రాంగ్ చేసుకోవడానికే ప్రయారిటీ ఇస్తున్నారు.
ఇక బీహార్లో సక్సెస్ అయిన కుల సమీకరణాలు బెంగాల్లో పని చేయవు కాబట్టి, ఇక్కడ ప్రాంతీయ, మతపరమైన సమీకరణాలపై దృష్టి పెట్టారనే టాక్ నడుస్తోంది. హిందూ ఓట్ల పోలరైజేషన్ బీజేపీకి ప్లస్ అవుతుందని అంచనా. ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్నా, అవి తక్కువ సీట్లకే పరిమితం కాబట్టి.. మిగిలిన ప్రాంతాల్లో హిందూ ఓటర్లను ఏకం చేస్తే గెలుపు సాధ్యమేనని లెక్కలేస్తున్నారు. అలాగే, అక్రమ వలసదారుల ఇష్యూని హైలైట్ చేస్తూ, దీదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే గత ఎన్నికల్లో 100కు పైగా సీట్లలో పట్టు సాధించిన బీజేపీ, ఈసారి 160 నుంచి 170 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకుంది.
అయితే, గణాంకాలు చూస్తే.. 2019లో వచ్చిన 40% ఓటింగ్ షేర్, 2024 లోక్సభ ఎన్నికల్లో తగ్గడం బీజేపీకి ఒక హెచ్చరికే. తృణమూల్ 48% ఓటు షేర్తో బలంగా ఉంది. దీన్ని దాటాలంటే బీజేపీకి అదనంగా మరో 6% ఓట్లు కావాలి. ఇది అంత ఈజీ కాదు. కానీ బీహార్ విజయంతో ఫుల్ జోష్లో ఉన్న అమిత్ షా టీమ్, బెంగాల్లోనూ కాషాయ జెండా ఎగరేయడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. మరి వారి ప్రణాళికలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates