అమిత్‌షాతో 20 నిమిషాలు బాబు ఏకాంత భేటీ.. విష‌యం ఏంటి ..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. కేంద్ర హోం శాఖ మంత్రితో 20 నిమిషాల పాటు ఏకాంతంగా భేటీ అయ్యారా? రాష్ట్రంలో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌పై ఆయ‌న చ‌ర్చించారా? అంటే.. ఔన‌నే అంటున్నారు టీడీపీ ఎంపీలు. అయితే.. లోప‌ల ఏం జ‌రిగిందో త‌మ‌కు తెలియ‌ద‌ని చెబుతూనే.. కొన్ని ‘కీల‌క‌’ విష‌యాలు చ‌ర్చించిన‌ట్టు పేర్కొన్నారు. బీహార్‌లో ఎన్డీయే ప్ర‌భుత్వం మ‌రోసారి కొలువుదీరింది. సీఎంగా నితీష్ కుమార్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్ హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్ర‌బాబు భేటీ అయ్యార‌న్న‌ది వాస్త‌వం. వేదిక‌పై కూడా దాదాపు ఇద్ద‌రూ ప్ర‌మాణ స్వీకారం జ‌రుగుతున్న‌ప్ప‌టికీ.. ముచ్చ‌టించుకుంటూనే క‌నిపించారు. దీనికి ముందు ఇద్ద‌రూ.. ఏకాంతంగా 20 నిమిషాలు చ‌ర్చించుకున్నార‌ని జాతీయ మీడియాలోనూ చ‌ర్చ వ‌చ్చింది. అయితే.. ఏ విష‌యాల‌పై అనేది స్ప‌ష్ట‌త లేదు. కానీ, మూడు కీల‌క విష‌యాల‌పై చ‌ర్చించి ఉంటార‌ని జాతీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

1) ఇటీవ‌ల ఏపీలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌: ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్ర‌నేత హిడ్మా మృతి చెందారు. అదేవిధంగా వ‌రుసగా రెండో రోజు కూడా మారేడు మిల్లి అట‌వీ ప్రాంతంలో ఎన్ కౌంట‌ర్ జ‌రిగింది. ఈ విష‌యంపై చంద్ర‌బాబు.. అమిత్ షాలు చ‌ర్చించుకుని ఉంటార‌న్న‌ది విశ్లేష‌కులు చెబుతున్న మాట‌. రాష్ట్రానికి మావోయిస్టులు ఎలా వ‌చ్చార‌న్న విష‌యంతోపాటు.. గ‌తంలో త‌న‌పై జ‌రిగిన దాడి(అలిపిరి) విష‌యాన్ని కూడా చంద్ర‌బాబు ప్ర‌స్తావించార‌ని చెబుతున్నారు.

2) చంద్ర‌బాబు బీహార్‌కు వెళ్లిన రోజే.. వైసీపీ అధినేత జ‌గ‌న్ కోర్టుకు వెళ్లారు. ఆయ‌న‌పై ఉన్న అక్ర‌మాస్తుల కేసులో నాంప‌ల్లిలోని సీబీఐ కోర్టుకు హాజ‌ర‌య్యారు. ఈ విష‌యాన్ని కూడా చంద్ర‌బాబు అమిత్ షాకు వివ‌రించి ఉంటార‌ని.. కేసుల ప‌రిణామం.. ఆయ‌న బెయిల్పై ఉన్న తీరు… వంటివి ఇరువ‌రి మ‌ధ్య ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చి ఉంటాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

అదేవిధంగా 3) త్వ‌ర‌లో ఏపీకి రావాల‌ని.. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న డిఫెన్స్ సెక్ట‌ర్‌(మ‌చిలీప‌ట్నం)ను ప‌రిశీలించాల‌ని చంద్ర‌బాబు అమిత్ షాను ఆహ్వానించిన‌ట్టు తెలుస్తోంది.