వెంక్నన దర్శనం..కరోనాకు ముందు..కరోనా తర్వాత

కలియుగ దైవం వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు ప్రపంచం నలుమూలల నుంచి తిరుమలకు వస్తుంటారు. విదేశాలతో పాటు మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు….తమ బాలాజీకి మొక్కులు చెల్లించుకునేందుకు వెంకన్న సన్నిధికి వస్తుంటారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అయితే లక్షలాది మంది భక్తులతో తిరుమల తిరుపతి దేవస్థానం కిటకిటలాడుతుంటుంది.

అయితే, కరోనా మహమ్మారి పుణ్యమా అంటూ గత 40 రోజులుగా తిరుమలతో పాటు దేశంలోని అన్ని మతాల ప్రార్థనా మందిరాలను మూసివేశారు. స్వామివారికి నిత్య నైవేద్య పూజలు జరుగుతున్నప్పటికీ…వెంకన్న సన్నిధిలోకి సాధారణ భక్తులకు అనుమతి లేదు. లాక్ డౌన్ 3.0లోనూ ప్రార్థనా మందిరాలకు, మతపరమైన కార్యక్రమాలను అనుమతినివ్వలేదు.

ఈ నేపథ్యంలో భవిష్యత్తులో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేసిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు మళ్లీ స్వామివారి దర్శనాన్ని కల్పిస్తామని, అయితే, తిరుమలలో గతంలో మాదిరి వేలు, లక్షల మందికి దర్శనాలు ఉండకపోవచ్చని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

కొంతకాలం వరకు భక్తులందరూ భౌతిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు, క్యూలైన్లలో కూడా మార్పులు ఉంటాయని వైవీ తెలిపారు. ఒక్కో భక్తుడు కనీసం ఒక మీటర్ భౌతి దూరాన్ని పాటించేలా చూస్తామన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత సాధ్యమైనంత త్వరలో భక్తులకు దర్శన అనుమతి కల్పిస్తామన్నారు. మాస్కులు, శానిటైజర్లు వంటి సదుపాయాలు తిరుమలలోనూ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని వైవీ చెప్పారు.

కరోనా పుణ్యమా అంటూ… ఇకపై తిరుపతిలో తనివితీరా స్వామివారి దర్శనం చేసుకోవచ్చని కొందరు భక్తులు అభిప్రాయపడుతున్నారు. గతంలో మాదిరిగా క్యూలైన్లో తోపులాటలు, పరిగెత్తించడాలు వంటివి ఉండకపోవచ్చని అనుకుంటున్నారు. గతంలో దర్శనం సమయంలో చాలామందికి క్యూలైన్లలో తమ వంతు ఎప్పుడు వస్తుందా అన్న విషయంపై ఫోకస్ ఉంటుందని…ఇకపై పరిమిత సంఖ్యలో భక్తులకు …క్రమ పద్ధతి ప్రకారం అనుమతి ఉండే అవకాశం ఉండడంతో ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు.

మనసంతా దేవుడిపై లగ్నం చేయవచ్చని…హాయిగా వెంకన్నను ఆరాధించవచ్చని అంటున్నారు. గతంలో ఓ టైం స్లాట్ లో వందలాది భక్తులను పంపేవారని…అప్పుడు కూడా తోపులాటలు, ఇబ్బందులు ఉండేవని…ఇకపై పరిమిత సంఖ్యలో వ్యక్తిగతంగా లేదా కుటుంబాల వారీగా టైం స్లాట్ కేటాయిస్తారేమోనని అనుకుంటున్నారు.