చంద్రబాబుకు జగన్ భయపడ్డాడా?

గత ఏడాది ఎన్నికల్లో ఏకంగా 151 సీట్లు సాధించింది వైఎస్సార్ కాంగ్రెస్. తెలుగుదేశం 23 స్థానాలకు పరిమితమైంది. ఇక అప్పట్నుంచి ప్రతిపక్షాన్ని అధికార పక్షం ఎలా ఆడుకుంటూ ఉందో చూస్తూనే ఉన్నాం. ఎప్పుడూ అధికార పార్టీ.. తెలుగుదేశంను ఇబ్బంది పెట్టడం, భయపెట్టడమే చూస్తున్నాం. ప్రతిపక్షం లేవనెత్తే ఏ అంశాన్నీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. పంతానికి అయినా వాళ్ల డిమాండ్లను విస్మరిస్తూ వస్తోంది.

ఇక అసెంబ్లీలో అయితే అధికార పార్టీ ఎంత దూకుడుగా వ్యవహరిస్తోందో.. ప్రతిపక్షాన్ని ఎలా బెంబేలెత్తిస్తోందో తెలిసిందే. తాజాగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా.. అధికార పార్టీ అదే దూకుడును ప్రదర్శించింది. చంద్రబాబును జగన్ సహా అందరూ టార్గెట్ చేశారు. ఆయన ఆవేశపడుతుంటే వాళ్లు కామెడీగా తీసుకున్నారు. ఐతే అసెంబ్లీలో గాంభీర్యం ప్రదర్శించనప్పటికీ.. కొన్ని గంటలు గడిచేసరికి ప్రభుత్వం భయపడిందని స్పష్టమవుతోంది.

2019 సంవత్సరానికి సంబంధించి పంటల బీమా విషయంలో ప్రభుత్వం రైతులను మోసం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. అసలు రైతుల కోసం ప్రభుత్వం బీమానే చెల్లించలేదని, సమాచార హక్కు చట్టం ద్వారా తీసిన సమాచారంతో సభలో ఆధారాలు చూపించింది టీడీపీ. ఈ విషయమై మాట మార్చి డిసెంబరు 15న కడతామని మాట మార్చింది ప్రభుత్వం. సకాలంలో బీమా చెల్లించకపోవడం వల్ల రైతులకు 2 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు కూడా టీడీపీ వాదించింది. ఐతే ఈ విషయం జనాల్లోకి వెళ్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ప్రభుత్వం అర్థం చేసుకున్నట్లుంది. ఈ విషయమై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో పంట బీమాపై చర్చ జరిగిన కొన్ని గంటలకే.. రాత్రి 9 గంటలకు రైతుల షేర్ కింద 590 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించేందుకు జీవోను విడుదల చేసింది ప్రభుత్వం. దీన్ని బట్టి చంద్రబాబుకు జగన్ భయపడ్డాడనడంలో సందేహం ఏముంది?