Political News

చంద్ర‌బాబుపై ప్ర‌జ‌ల‌కు చాలా న‌మ్మ‌కం ఉంది: ఉప‌రాష్ట్ర‌ప‌తి

భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తి సీపీ రాధాకృష్ణ‌న్‌.. ఏపీ సీఎం చంద్ర‌బాబుపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. చంద్ర‌బాబుపై ఏపీ ప్ర‌జ‌ల‌కు చాలా న‌మ్మ‌కం ఉంద‌ని.. ఆయ‌న విజ‌న్‌ప‌ట్ల ఎంతో మందికి మ‌క్కువ ఉంద‌ని అన్నారు. భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఈ నెల 9న ఘ‌న విజ‌యం ద‌క్కించుకున్న సీపీ రాధాకృష్ణ‌న్‌.. తొలిసారి బుధ‌వారం ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. సీఎం చంద్ర‌బాబు స‌హా మంత్రి నారా లోకేష్ ఆయ‌న‌కు విజ‌య‌వాడ విమానాశ్ర‌యంలో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం.. తొలుత సాయంత్రం ఆయ‌న ఇంద్ర‌కీలాద్రిపై ఉన్న బెజ‌వాడ దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్నారు. దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా దుర్గమ్మ బుధ‌వారం అన్న‌పూర్ణాదేవి అలంకారంలో ద‌ర్శ‌మిచ్చింది. ఆమెను కుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకున్న ఉప‌రాష్ట్ర‌ప‌తి.. ఆనందం వ్య‌క్తం చేశారు.

అనంత‌రం.. విజ‌య‌వాడలోని భ‌వానీ ఘాట్‌కు చేరుకున్న ఉప‌రాష్ట్ర‌ప‌తి దంప‌తులు.. ఇక్క‌డ జ‌రుగుతున్న `విజ‌య‌వాడ ఉత్స‌వ్‌`ను తిల‌కించారు. అనంత‌రం.. ఆయ‌న మాట్లాడుతూ.. సీఎం చంద్ర‌బాబుపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఏపీ ప్ర‌జ‌లు చంద్రబాబుపై ఎంతో న‌మ్మ‌కం పెట్టుకున్నార‌ని.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయ‌డంతోపాటు పెట్టుబడులు కూడాసాధిస్తార‌ని విశ్వ‌సిస్తున్నార‌ని తెలిపారు. ప్ర‌జ‌ల న‌మ్మ‌కం మేర‌కు చంద్ర‌బాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్ర‌భుత్వం సుప‌రిపాల‌న‌ను అందిస్తోంద‌న్నారు. చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో రాష్ట్రానికి ఎంతో భ‌విష్య‌త్తు ఉంద‌ని తెలిపారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రం దూసుకువెళ్తోంద‌ని చెప్పారు. భ‌విష్య‌త్తులో మ‌రింత‌గా అభివృద్ధి చెందుతుంద‌న్నారు.

ఇక‌, విజ‌య‌వాడ న‌గ‌రంపైనా ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌లుకీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ రాష్ట్రం దేశానికే అన్న‌పూర్ణ‌గా ఉంద‌న్న ఆయ‌న‌.. విజ‌య‌వాడ రాష్ట్ర అభివృద్ధిలో కీల‌క పాత్ర పోషిస్తోంద‌ని తెలిపారు. ఎటు చూసినా.. ప‌చ్చ‌ని అందాలు క‌నిపించాయ‌ని తెలిపారు. ప‌క్క‌నే కృష్ణాన‌ది ఉండ‌డం మ‌రింత‌శోభాయ‌మానంగా ఉంద‌న్నారు. అయితే.. విజ‌య‌వాడ హాట్ సిటీ అని చ‌మ‌త్క‌రించారు. వేస‌విలో ఇక్క‌డ భారీ ఎండ‌లు ఉంటాయ‌ని.. చెప్పారు. కానీ, ఇక్క‌డిప్ర‌జ‌లు మాత్రం చాలా కూల్‌గా ఉంటార‌ని ఉప‌రాష్ట్ర‌ప‌తి వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు విజ‌న్‌తో రాష్ట్రం విక‌సిత్ ఏపీగా మార‌నుంద‌న్నారు. ఇక్క‌డి వారి సంప్ర‌దాయాలు చాలా గొప్ప‌వ‌ని తెలిపారు.

తిరుమ‌ల‌కు..

విజ‌య‌వాడ ప‌ర్య‌ట‌న అనంత‌రం.. ఉప‌రాష్ట్ర‌ప‌తి తిరుప‌తికి వెళ్లారు. తిరుమ‌ల‌లో బుధ‌వారం రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్స‌వాల్లో సీఎం చంద్ర‌బాబుతో క‌లిసి ఆయ‌న పాల్గొంటారు. శ్రీవారి వాహ‌న సేవ‌ల్లోనూ ఆయ‌న పాల్గొంటారు. కాగా.. తొలిసారి రాష్ట్రానికి వ‌చ్చిన రాధాకృష్ణ‌న్‌కు ప‌లువురు నాయ‌కులు.. అభినంద‌న‌లు తెలిపారు. ముఖ్యంగా విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆహ్వానం మేర‌కు.. తాను వ‌చ్చాన‌ని రాధాకృష్ణ‌న్‌ చెప్ప‌డంతో ఆయ‌న పొంగిపోయారు.

This post was last modified on September 24, 2025 8:14 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మ‌మ‌త ప‌రిస్థితి.. ఏపీకి పాఠం అవుతుందా?!

త‌మ్ముడు త‌మ్ముడే.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే.. బీజేపీ విష‌యంలో ఇది అక్ష‌రాలా నిజం. త‌న‌కు అవ‌కాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…

2 hours ago

‘అడ్డంకులెన్నైనా.. ఆకివీడు రామాలయ నిర్మాణం ఆగదు’

ఏపీలో మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.…

3 hours ago

కెపాసిటీ లేకే ర‌జినీ సినిమా వ‌దిలేశా

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మించే సినిమా ద‌ర్శ‌కుడి ఎంపిక విష‌యంలో ఎంత త‌ల‌నొప్పి ఎదురైందో…

4 hours ago

తొలిసారి బాల‌య్య‌తో అనిరుధ్‌?

టాలీవుడ్లో ఇప్ప‌టికే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో పాటు నాని, విజ‌య్…

5 hours ago

పవన్ వచ్చాక పిఠాపురంలో ఏం చేశారు?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌కవ‌ర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ 2024…

6 hours ago

‘కల్తీ నెయ్యి’లో ఆ ఇద్దరిదే కీలక భూమిక?

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న కేసులో రోజుకో కొత్త…

6 hours ago