వైసీపీ లేని లోటు తీర్చేస్తున్న త‌మ్ముళ్లు

ఏపీ అసెంబ్లీకి రావాల‌ని.. స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాల‌ని.. మాట్లాడేందుకు స‌మ‌యం ఇస్తామ‌ని చెప్పినా.. వైసీపీ నాయకులు, ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ మంకు ప‌ట్టుప‌ట్టి రాకుండా ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే.. విప‌క్షం లేని లోటును మ‌న వాళ్లే తీర్చాల‌న్న సీఎం చంద్ర‌బాబు సూచ‌న‌ల‌తో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ప్ర‌జ‌ల త‌ర ఫున గ‌ళం వినిపిస్తున్నారు. అనేక స‌మ‌స్య‌ల‌పై వారు స‌భ‌లో స్పందిస్తున్నారు. మంత్రుల‌ను సూటిగా ప్ర‌శ్నిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో చెత్త స‌హా.. టిడ్కో ఇళ్ల విష‌యంపై స‌భ్యులు ప్ర‌శ్నించారు. అదేస‌మ‌యంలో పోల‌వ‌రం ప్రాజెక్టుల స‌హా ఇత‌ర సాగునీటి ప్రాజెక్టుల‌పైనా ప్ర‌శ్న‌లు సంధించారు.

ఆయా ప్ర‌శ్న‌ల‌కు మంత్రులు నారాయ‌ణ‌, నిమ్మ‌ల రామానాయుడు స‌మాధానాలు చెప్పారు. మంత్రి నారాయ‌ణ స్పందిస్తూ.. గ‌త ప్ర‌భుత్వం చెత్త ప‌న్ను వేసినా 85 ల‌క్ష‌ల ట‌న్నుల చెత్త‌ను తొల‌గించ‌కుండా వ‌దిలేసిందన్నారు. త‌మ‌ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కూ 82 ల‌క్ష‌ల ట‌న్నులు పూర్తిగా తొల‌గించామ‌ని వివ‌రించారు. అక్టోబ‌ర్ 2 నాటికి మ‌రో లక్ష‌ ట‌న్నుల చెత్త తొల‌గిస్తామ‌ని చెప్పారు. 2019-24 మ‌ధ్య కాలంలో పారిశుద్య నిర్వ‌హ‌ణ‌లో నిర్ల‌క్ష్యం తో ప్ర‌జ‌లు తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నారని విమ‌ర్శించారు.

త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత 50 కోట్ల‌తో 21 వేల కిమీ డ్రెయిన్ల పూడిక తీసిన‌ట్టు మంత్రి నారాయ‌ణ చెప్పారు. రాష్ట్రంలోని 6249 బ్లాక్ స్పాట్ ల‌ను గుర్తించి ఇప్ప‌టివ‌ర‌కూ 2000 గ్రీన్ స్పాట్ లుగా మార్చామ‌న్నారు. ఘ‌న వ్య‌ర్ధాల నిర్వ‌హ‌ణ కోసం వేస్ట్ టు ఎన‌ర్జీ ప్లాంట్ ల ఏర్పాటుకు టెండ‌ర్లు పిలిచిన‌ట్టు తెలిపారు. ద్ర‌వ వ్య‌ర్ధాల నిర్వ‌హ‌ణ‌కు 1957 ఎంఎల్ డీ కెపాసిటీతో ఎస్టీపీల అవ‌స‌రం ఉంద‌న్న ఆయ‌న‌.. ప్ర‌స్తుతం 533 ఎంఎల్డీ కెపాసిటీ ఎస్టీపీలు ఉన్నాయని, మ‌రో 1200 ఎంఎల్డీ ఎస్టీపీ లు నిర్మాణ ద‌శ‌లో ఉన్నాయని వివ‌రించారు.

మంత్రి నిమ్మ‌ల రామానాయుడు స్పందిస్తూ.. పోలవరం పునరావాసం, పరిహారం, సాగు నీటి ప్రాజెక్టుల నిర్వహణపై స‌మాధానం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా 373 నివాస ప్రాంతాల్లో 96,660 కుటుంబాలను తరలించాల్సి ఉందన్నారు. 41.15 మీటర్ల కాంటూరు వరకు 38,060 కుటుంబాలకు, 45.72 మీ కాంటూరు పరిధిలో 58,600 కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని చెప్పారు. 41.15 మీ కాంటూరు పరిధిలో 19,953 కుటుంబాలకు పరిహారం అందించామ‌న్నారు. ఫేజ్-1 కింద 18, 964 మంది లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించామ‌ని మంత్రి వివ‌రించారు. సాగు నీటి ప్రాజెక్టుల నిర్వహణ కోసం మొత్తం 2973 మంది సిబ్బంది పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు.