తాము తీసుకువచ్చిన వైద్య కళశాలలను ప్రైవేటుకు ధారాదత్తం చేస్తున్నారని.. పేర్కొంటూ వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య కళాశాలలపై చర్చకు సిద్ధమేనా? అని ప్రశ్నించారు. దమ్ముంటే.. అసెంబ్లీకి రావాలని.. అన్ని విషయాలపైనా చర్చించేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. తాజాగా రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో సీఎం.. మెడికల్ కాలేజీల వ్యవహారంపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తన హయాంలో తీసుకువచ్చిన కాలేజీల వివరాలను వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్రంలో పరిస్థితిని కూడా వివరించారు.
1995 నాటికి(అంటే సీఎంగా తాను చార్జి తీసుకునే సమయానికి) 650 మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవని సీఎం చెప్పారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక 1282 మెడికల్ సీట్లు తేగలిగినట్టు చెప్పారు. గతంలో జిల్లాకు ఓ వైద్య కళాశాల పెట్టామన్నారు. అది వైద్యారోగ్య రంగంలో గేమ్ చేంజర్గా మారిందని తెలిపారు. ప్రతి కిలోమీటరుకు ఒక ఎలిమెంటరీ స్కూల్ కూడా ఏర్పాటు చేశామన్నారు. ప్రతి 3 కిలో.మీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి 5 కిలో.మీటర్లకు ఒక హైస్కూల్, ప్రతి మండలంలో ఒక జూనియర్ కాలేజీ, రెవెన్యూ డివిజన్కు ఒక ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టామని వివరించారు.
ఇదేసమయంలో పేదల ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యం ఇచ్చామన్నారు. “ఇప్పుడు కొంత మంది తయారు అయ్యారు. మెడికల్ కాలేజీలకు వీళ్ళు ఖర్చు చేసింది, కేవలం 5 శాతం నిధులు మాత్రమే. 5% ఖర్చు చేసి మొత్తం కట్టేశాం అని చెప్తున్నారు. గతంలో వాళ్ళు 50% సీట్లు ఫ్రీ పెట్టారు, ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది.“ అని సీఎం చంద్రబాబు వైసీపీపై విమర్శలు గుప్పించారు. పీపీపీ విధానంలో చేపట్టే మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కొనసాగుతాయని వ్యాఖ్యానించారు. ఒక కాలం తర్వాత అది ప్రభుత్వ ఆస్తి అవుతుందని చెప్పారు. దీన్ని కొందరు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని.. బలంగా ఎదుర్కోవాలని కలెక్టర్లకు సూచించారు.
దమ్ముంటే అసెంబ్లీకి రావాలని.. మరోసారి సీఎం చంద్రబాబు వైసీపీ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీలో మెడికల్ కాలేజీల వ్యవహారంపైనా చర్చిస్తామన్నారు. ఎవరు ఎవరికి ఏం చేశారో చర్చించేందుకు తాము రెడీగా ఉన్నామని చెప్పారు. కానీ, తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్న ఆయన.. కలెక్టర్లు.. ఆధారాలతో సహా.. మీడియాకు వివరించాలని సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates