సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలాకాలంగా పదునైన విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ పై అవమానకర రీతిలో రేవంత్ చేస్తున్న విమర్శలకు కేటీఆర్ ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తున్నారు. ఆ కౌంటర్లకు దీటుగా రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ ను తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ఇలా ఈ ఇద్దరు నేతల మధ్య చాలాకాలంగా మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఆ మాటల యుద్ధం తారస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన కామెంట్లు అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డికి దమ్ముంటే, మగాడైతే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలంటూ కేటీఆర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపాయి.
తనకు ఈ తరహా భాష వాడడం ఇష్టముండదని, కానీ, రేవంత్ కు ఆయన భాషలో చెబితేనే అర్థమవుతుందని ఇలా మాట్లాడాల్సి వచ్చిందని కేటీఆర్ చెప్పారు. రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏమైనా పొడిచింది అని రేవంత్ అనుకుంటే ఆ పది మందితో రాజీనామా చేయించాలని, అప్పుడు ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని ఛాలెంజ్ చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలన, పనితీరు ఏంటో…నీ పనితీరు ఏంటో ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారని రేవంత్ ను ఉద్దేశించి గద్వాలలో జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
6 నెలల్లో గద్వాల ఉఫ ఎన్నిక ఖాయమని, 50 వేల మెజారిటీతో అక్కడ గులాబీ జెండా ఎగరడం ఖాయమని కేటీఆర్ జోస్యం చెప్పారు. గద్వాల ఎమ్మెల్యే దొంగల ముఠాలో చేరాడని, చిత్తుగా ఓడించి అతడికి బుద్ధి చెబుదామని గద్వాల ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు ఆదేశాలు, ఆ తర్వాత వారికి స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులివ్వడం వంటి పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కు మద్దతిచ్చి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన 10 మంది ఎమ్మెల్యేలు ఇరకాటంలో పడ్డారు. ఈ క్రమంలోనే రేవంత్ తో పాటు ఆ పది మంది ఎమ్మెల్యేలను కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ కు కేటీఆర్ సవాల్ విసిరారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates