ఎవ‌రు ఎటువైపు: రేపు ఉప‌రాష్ట్ర‌ప‌తి పోరు!

దేశ రెండో పౌరుడు ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అయింది. మంగ‌ళ‌వారం(ఈ నెల 9) పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్‌లో ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఎన్నిక‌లో రాజ్య‌స‌భ‌, లోక్‌స‌భ‌ల‌లోని స‌భ్యుల‌తోపాటు.. నామినేటెడ్ స‌భ్యులు కూడా ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అయితే.. అస‌లు కాక తాజాగా ప్రారంభ‌మైంది. ఈ ఎన్నిక‌ల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న‌ ఎన్డీయే ప‌క్షాల త‌ర‌ఫున మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ సీపీ రాధాకృష్ణ‌న్ బ‌రిలో ఉన్నారు. ఇక‌, ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండీ కూట‌మి త‌ర‌ఫున సుప్రీంకోర్టు మాజీన్యాయ‌మూర్తి జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డి పోటీలో ఉన్నారు.

స‌మీక‌ర‌ణ‌లు మారాయా?

ఇక‌, తాజా ఎన్నిక‌ల‌కు సంబంధించి.. ఎన్డీయే ప‌క్షానికే బ‌లం క‌నిపిస్తోంది. ఉభ‌య స‌భ‌ల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట మికి 425 మంది స‌భ్యులు ఉన్నారు. దీంతో ఎన్డీయే అభ్య‌ర్థి సీపీ రాధాకృష్ణ‌న్ విజ‌యం దాదాపు ఖ‌రారైంద‌నే చ‌ర్చ కొన్నాళ్లుగా సాగుతోంది. అయితే.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మికి ఇరు స‌భ‌ల్లోనూ 311 మంది స‌భ్యుల మద్ద‌తు ఉంది. అయి తే.. ఈ రెండు కూట‌ముల మ‌ధ్య భారీ వ్య‌త్యాసం క‌నిపిస్తున్నా.. చివ‌రి నిముషంలో స‌మీక‌ర‌ణ‌లు మారే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ గ‌త రెండు రోజులుగా జాతీయ రాజ‌కీయ వ‌ర్గాల్లో చోటు చేసుకున్నాయి. ప్ర‌స్తుతం మ‌రో 45 మంది స‌భ్యులు త‌ట‌స్థంగా ఉన్నారు. వీరిలో రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ఎంఐఎం, వైసీపీ వంటివి ఉన్నాయి.

ఈ 45 మందిలో వైసీపీ ఎన్డీయేకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించినా.. మ‌రికొంద‌రు మాత్రం ఎటువైపైనా చివ‌రి నిముషంలో మార్పులు చేర్పులు జ‌రిగే అవ‌కాశం ఉంటుంద‌ని లెక్క‌లు వేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే స‌మీక‌ర‌ణ‌ల మార్పుపై స‌ర్వ‌త్రా చ‌ర్చ సాగుతోంది. ఇక‌, మ‌రో రీజ‌న్‌.. క్రాస్ ఓటింగ్‌. లేదా.. వేసిన ఓట్లు చెల్లుబాటు కాక‌పోవ‌డం. ఈ విష‌యంపై కూడా జాతీయ స్థాయిలో చ‌ర్చ సాగుతోంది. సాధార‌ణ పోలింగ్‌గా కాకుండా ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్ భిన్నంగా ఉంటుంది. ఎంపీలు.. త‌మ ఓట్ల‌ను మురిగిపోకుండా.. జాగ్ర‌త్త‌గా వేయాలి. ఏ చిన్న పొర‌పాటు జ‌రిగినా మురిగిపోతుంటాయి. ఈ విష‌యంలోనూ కూట‌మి పార్టీలు శ్ర‌ద్ధ తీసుకుంటున్నాయి.

ఎంఐఎం చ‌క్రం..

హైద‌రాబాద్ ఎంపీ.. అస‌దుద్దీన్ ఓవైసీ ఇండీ కూట‌మికి మ‌ద్ద‌తు తెల‌ప‌డం క‌లిసి వ‌చ్చే అంశంగా మారింది. అయితే.. ఈ పార్టీకి సంఖ్యా బ‌లం లేకున్నా.. ఇత‌ర పార్టీల‌ను కూడ‌గ‌ట్టే అవ‌కాశం మెండుగా ఉంటుంది. ఇక‌, వైసీపీ కూడా అంత‌ర్గ‌తంగా ఎంఐఎం పార్టీ వైపు న‌డిచే అవ‌కాశం లేక‌పోలేద‌న్న వాద‌న వినిపిస్తోంది. అందుకే.. ఇండీ కూట‌మిలో ఒకింత ఆశ‌లు రేకెత్తుతున్నాయి. మ‌రోవైపు.. ఇండీ కూట‌మి అభ్య‌ర్థి సుద‌ర్శ‌న్ రెడ్డి సెంటిమెంటు దిశ‌గా చేసిన వ్యాఖ్య‌లు కూడా ప‌లువురు ఎంపీల‌ను పార్టీల‌కు అతీతంగా త‌మ‌కు అనుకూలంగా మార్చే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ కూడా ఇండీ కూట‌మిలో వినిపిస్తోంది. ఏదేమైనా.. మంగ‌ళ‌వారం జ‌రిగే ఎన్నిక‌ల పోరు.. ఆస‌క్తి రేపుతోంది.