అమెరికా అంటేనే ప్రపంచ దేశాలన్నీపెద్దన్నగా, అగ్ర దేశంగా పరిగణిస్తూ గౌరవిస్తూ ఉంటాయి. ఇప్పటిదాకా ఆ దేశానికి అధ్యక్షులుగా వ్యవహరించిన వారంతా ఆ గౌరవాన్ని కాపాడుకున్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తన తొలి టెర్మ్ లో సవ్యంగానే నడుచుకున్నారు. అయితే ఎందుకనో గానీ రెండో సారి అధ్యక్ష పీఠం అందగానే ఆయనలోని వింతలు, వికారాలు అన్నీ బయటకు వచ్చాయి. విదేశాలన్నింటినీ పూచిక పుల్లల్లా తీసివేసిన ట్రంప్… అందులో భారత్ నూ చేర్చారు. అయితే భారత్ దమ్ము, శక్తి, సత్తా ఏమిటో నెలలు తిరక్కుండానే ట్రంప్ కు తెలిసివచ్చింది. ఇప్పుడు ఆయన పశ్చాత్తపడుతున్నారు.
శత్రు దేశాల జాబితాలో ఉన్న చైనా వంటి అగ్ర దేశాలతో పాటు మిత్ర దేశాలుగా ఉన్న భారత్ పైనా ట్రంప్ సుంకాల మోత మోగించారు. అయితే ఈ సుంకాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏమాత్రం భయపడలేదు. దానికి ప్రత్యామ్నాయ వ్యూహాలు రచించారు. అందులో భాగంగా రష్యాతో బంధాలతో పెంచేసిన మోదీ, చైనాతో అప్పటిదాకా అంటీముట్టనట్టుగా వ్యవహరించినా… తాజాగా చైనా పట్ల స్నేహపూర్వక వైఖరితో సాగారు. భారత్ సత్తా ఏమిటో తెలిసిన చైనా… భారత్ ను గట్టిగా పట్టేసుకుంది. భారత్ తో రష్యా, చైనాలు మరింత స్నేహంగా సఖ్యతగా మెలిగే సంకేతాలు అయితే విస్పష్టంగా బయటకు వెళ్లాయి.
ఈ విషయాలన్నీ పరిశీలించిన ట్రంప్… అయ్యయ్యో తాను చేసిన పని వల్ల భారత్ తనకు దూరం కావడం కాక… రష్యా కూడా దూరమైపోయిందే అని శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో భారత్, రష్యాలు చైనాతో సుధీర్ఘ కాలం పాటు స్నేహ సంబంధాలను కొనసాగించే అవకాశాలు లేకపోలేదని భయాందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామం ఎప్పటికైనా తమ దేశానికి ముప్పేనని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇటీవల చైనా ప్రదర్శించిన ఆయుధ విన్యాసాలను చూసిన తర్వాతే ట్రంప్ కు ఈ తరహా భావన వచ్చినట్టుగా సమాచారం. తనతో భారత్, రష్యా కలవడంతోనే చైనా ఈ సాహసానికి దిగినట్టు తెలుస్తోంది. మొత్తంగా భారత్ తనకు దూరం కావడం పట్ల ఏం జరుగుతుందో ట్రంప్ కు ఇప్పటికే అర్థమైపోయిందని చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates