బ్రేకింగ్… ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా

తెలంగాణ రాజకీయాల్లో వరుసగా బుధవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అదే సమయంలో పార్టీ నుంచి దక్కిన శాసనమండలి సభ్యత్వానికి (ఎమ్మెల్సీ) రాజీనామా చేశారు. అది కూడా స్పీకర్ ఫార్మాట్ లో ఆమె రాజీనామా చేయడం గమనార్హం. ఈ మేరకు పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసిన మరునాడు బుధవారం మీడియా ముందుకు వచ్చిన కవిత ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత బుధవారం తన ఇంటి సమీపంలోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి భర్త అనిల్, చిన్న కుమారుడితో కలిసి వచ్చిన కవిత… అప్పటికే అక్కడ కిక్కిరిసిన మీడియా ప్రతినిధులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. దాదాపుగా 40 నిమిషాల పాటు సుదీర్ఘంగా మాట్లాడిన కవిత… పార్టీలో తన ప్రస్థానం, పార్టీ కోసం తాను ఏం చేశాను? పార్టీ నేతలు తనపై చేసిన కుట్రలు తదితరాలను ఆమె ఏకరువు పెట్టారు.

ఇక పార్టీలో చేరడానికి కారణాన్ని కూడా చెప్పిన కవిత… తనకు పదవులపై ఎలాంటి ఆశ లేదన్నారు. ఉద్యమంలో తన తండ్రికి చేదోడు,వాదోడుగా నడిచేందుకు విదేశాల్లో ఉద్యోగాలు వదులుకుని మరీ వచ్చామని చెప్పారు. తనతో పాటు తన సోదరుడు కేటీఆర్ కు కూడా పదవులపై ఎలాంటి ఆశ లేదన్నారు. దక్కిన అవకాశాన్ని అందుకున్నామే తప్పించి… పదవుల కోసం అర్రులు చాచలేదని కవిత పేర్కొన్నారు. ఈ కారణంగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నప్పుడు ఆ పార్టీ నుంచి దక్కిన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశానని ఆమె చెప్పుకొచ్చారు.