దేశ రెండో అత్యున్నత పదవి ఉపరాష్ట్రపతి ఎన్నిక తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలకు సంకటంగా మారిందని చెప్పక తప్పదు. ఎందుకంటే…ఓ వైపు కేంద్రంలో అధికార ఎన్డీఏతో ఏపీలోని కీలక పార్టీలు పొత్తులో ఉన్నాయి. తెలంగాణ రాజకీయ పార్టీలు కాంగ్రెస్ అంటే వ్యతిరేకతతో ఏ నిర్ణయం తీసుకుంటాయో తెలియదు. ఇలాంటి సమయంలో తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలకు ఓ స్వచ్ఛమైన, క్లియర్ కట్ అభ్యర్థన చేశారు. మరి ఈ అభ్యర్థనకు ఏ మేర సానుకూలత వ్యక్తమవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఉపరాష్ట్రపతి ఎన్నికలో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ ఎంపికయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి తన అభ్యర్థిగా తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసింది. సుదర్శన్ రెడ్డి తెలంగాణకు చెందిన వారు కావడంతో ఆయనను గెలిపించుకునే బాధ్యత రేవంత్ పై ఓ మోస్తరు ఎక్కువగానే పడిందని చెప్పాలి. ఇతర రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నా… కనీసం తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీల నుంచి సుదర్శన్ రెడ్డికి మెజారిటీ ఓట్లు వేయించడమే లక్ష్యంగా రేవంత్ సాగుతున్నారు. అందులో భాగంగా మంగళవారం ఆయన తెలుగు రాష్ట్రాలకు చెందిన అన్ని రాజకీయ పార్టీలకు ఓ అభ్యర్థన చేశారు.
రేవంత్ చేసిన అభ్యర్థన చూస్తుంటే… మన తెలుగోడిని మనం కాకుంటే ఇంకెవరు గెలిపిస్తారు? మనమే గెలిపించుకోవాలి కదా అన్న భావన వ్యక్తమైంది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఏపీలో విపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల పేర్లను ప్రస్తావిస్తూ మన తెలుగు నేలకు చెందిన సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. అదే సమయంలో తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీల పేర్లతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ ప్రజా ప్రతినిధులు కూడా సుదర్శన్ రెడ్డికే మద్దతుగా నిలవాలని అభ్యర్థించారు.
రేవంత్ అభ్యర్థన బాగానే ఉంది గానీ… ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ గానీ, జనసేన గానీ రాధాకృష్ణన్ కే మద్దతు పలికాయి. ఇక కేసుల భయమో, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అడిగారనో తెలియదు గానీ.. ఇప్పటికే వైసీపీ కూడా ఎన్డీఏ అభ్యర్తికే మద్దతు తెలిపింది. ఈ లెక్కన ఏపీ నుంచి సుదర్శన్ రెడ్డికి ఓట్లు పడే ఛాన్సే లేదు. ఇక తెలంగాణ విషయానికి వస్తే… కాంగ్రెస్ తో పాటు బీజేపీతోనూ సమదూరం పాటిస్తున్న బీఆర్ఎస్… ప్రాంతీయత ఆధారంగా అడుగు ముందుకేస్తే… ఆ పార్టీ ఓట్లు సుదర్శన్ రెడ్డికి పడినట్టే. మజ్లిస్ ఓట్లు మాత్రం తప్పనిసరిగా సుదర్శన్ రెడ్డికే పడతాయని చెప్పొచ్చు. ఇక తెలంగాణలోని బీజేపీ నేతల ఓట్లు సుదర్శన్ రెడ్డికి దక్కే అవకాశాలు అంతంతమాత్రమే. మొత్తంగా రేవంత్ అభ్యర్థనకు అంతంతమాత్రం స్పందన మాత్రమే లభించనుందని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates