జ‌గ‌న్‌-అమిత్‌షాల మ‌ధ్యే హాట్‌లైన్‌: మాణిక్కం మాట‌

ఏపీ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్‌పై వైసీపీ అధినేత జ‌గ‌న్ చేసిన విమ‌ర్శ‌లు తెలిసిందే. రాష్ట్రంలో చంద్ర‌బాబు పాల‌న‌, అవినీతి, అక్ర‌మాలు ఆయ‌న‌కు క‌నిపించ‌డం లేద‌ని.. తాను మాత్ర‌మే మాణిక్కానికి క‌నిపిస్తున్నార‌ని బుధ‌వారం జ‌గ‌న్ విమ‌ర్శించారు. అంతేకాదు.. రాష్ట్రంలో ఓటు బ్యాంకు పై కూడా వారు ప్ర‌శ్నించ‌డం లేద‌న్నారు. రాహుల్‌గాంధీకి- చంద్ర‌బాబుకు మ‌ధ్య హాట్‌లైన్ కొన‌సాగుతోంద‌ని, అందుకే మౌనంగా ఉన్నార‌ని చెప్పుకొచ్చారు. అయితే.. ఈవ్యాఖ్య‌ల‌పై మాణిక్కం ఠాకూర్ తాజాగా రియాక్ట్ అయ్యారు.

అస‌లు హాట్‌లైన్ సంభాష‌ణ‌లు.. హాట్‌లైన్ వ్య‌వ‌హారాల‌కు కేంద్రం వైసీపీనేన‌ని వ్యాఖ్యానించారు. అమిత్ షాతో జ‌గ‌న్ అనేక సార్లు హాట్‌లైన్‌లో సంభాషించార‌ని చెప్పుకొచ్చారు. త‌మ‌కు, త‌మ నాయ‌కుడు రాహుల్ కు హాట్‌లైన్ తో ప‌నిలేద‌ని వ్యాఖ్యానించారు. ఏదైనా ధైర్యంగా ప్ర‌శ్నించే త‌త్వం త‌మ‌కు మాత్ర‌మే ఉందన్నారు. కేంద్రంలోని మోడీ, అమిత్‌షాలు ఎన్నిక‌ల సంఘంతో కుమ్మ‌క్క‌య్యార‌ని తాము చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు స్పందించే ధైర్యం జ‌గ‌న్‌కు ఉందా? అని ప్ర‌శ్నించారు.

జ‌గ‌న్ గురించి, ఏపీలో జుమ్లాల గురించి మాట్లాడే ధైర్యం త‌మ నాయ‌కురాలు ష‌ర్మిల‌కు మాత్ర‌మే ఉన్నాయ‌ని మాణిక్కం ఠాకూర్ వ్యాఖ్యానించారు. స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం.. జ‌గ‌న్ ఎంతకైనా దిగ‌జారుతాడ‌ని అన్నారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘంతో కుమ్మ‌క్క‌యిన వారిని జ‌గ‌న్ వ‌దిలేసి.. త‌మ‌పై ప‌డ్డార‌ని వ్యాఖ్యానిం చారు. జ‌గ‌న్ అవినీతి, అక్ర‌మాలు, లిక్క‌ర్ కుంభ‌కోణాన్ని ప్ర‌శ్నిస్తుండ‌డం వ‌ల్లే.. త‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని, ఇది నిజం కాక‌పోతే.. ఎందుకు భ‌య‌ప‌డుతున్నార‌ని ఎదురు ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ త‌న ప‌ద్ధ‌తిని మార్చుకోక‌పోతే.. మ‌రింత‌గా ప్ర‌శ్నిస్తామ‌ని హెచ్చ‌రించారు.