ట్రంప్ టారిఫ్‌ల సెగ.. అమెరికన్లకు మండుతోంది!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాలపై విధిస్తున్న సుంకాలు ఇప్పుడు అక్కడి ప్రజల జేబులపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు, దుస్తులు, బ్యాగులు వంటి రోజువారీ ఉపయోగపు వస్తువుల ధరలు పెరిగిపోయాయని ప్రజలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. సుంకాల కారణంగా షాపుల్లో ఒకే వస్తువు ధర కొద్ది నెలల వ్యవధిలోనే గణనీయంగా పెరిగిందని వారు చెబుతున్నారు.

ఈ పెరుగుదలపై సామాజిక మాధ్యమాల్లో గగ్గోలు పెడుతూ, ట్రంప్ విధానాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మెర్సిడెస్ ఛాండ్లర్ అనే అమెరికన్ మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేసి ఈ సమస్యను బహిరంగంగా ప్రస్తావించింది. తాను తరచూ షాపింగ్‌కు వెళ్లే వాల్‌మార్ట్‌లో ధరలు భారీగా పెరిగినట్లు ఆ వీడియోలో చూపించింది.

చిన్నపిల్లల డ్రెస్ ఒకటి గతంలో 6.98 డాలర్లకు దొరికేదని, ఇప్పుడు అదే డ్రెస్ 10.98 డాలర్లకు చేరిందని తెలిపింది. అలాగే, మరో డ్రెస్ ధర 10.98 నుండి 11.98 డాలర్లకు, బ్యాక్‌పాక్ ధర 19.97 నుండి 24.97 డాలర్లకు పెరిగిందని ఉదాహరణలు ఇచ్చింది. ఆమె మాటల్లో, “సగటున ప్రతి వస్తువుపై కనీసం 4 డాలర్లకు పైగా అదనంగా చెల్లించాల్సి వస్తోంది. పాత ధరపై కొత్త స్టిక్కర్ అతికించి విక్రయిస్తున్నారు. నమ్మకముంటే మీ దగ్గర్లోని వాల్‌మార్ట్ లేదా టార్గెట్‌కి వెళ్లి చూడండి” అని ఛాండ్లర్ స్పష్టంగా చెప్పింది. ఈ వీడియో కాసేపట్లోనే వైరల్‌గా మారింది.

వీడియో చూసిన నెటిజన్లు ట్రంప్ సుంకాలపై విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు వ్యంగ్యంగా, “ట్రంప్ చెబుతున్నట్లుగా డాలర్ల వర్షం కురుస్తోందేమో కానీ మనం కొనే వస్తువులపై అదనపు డాలర్లు వెచ్చించాల్సి వస్తోంది” అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఈ విధానాలు మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాలపై ఎక్కువ భారాన్ని మోపుతున్నాయని విమర్శిస్తున్నారు. మొత్తానికి, ట్రంప్ విధించిన టారిఫ్‌లు అంతర్జాతీయ మార్కెట్ పైనే కాదు, అమెరికన్ల జీవితంపైన కూడా ప్రభావం చూపుతున్నాయని అర్ధమవుతుంది.