ఆశ‌-నిరాశ‌ల్లో.. రేవంత్ ప్ర‌యాస‌!

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.. తాజాగా ఢిల్లీలో ధ‌ర్నా చేసి వ‌చ్చారు. అయితే.. ఆయ‌న‌కు వెంట‌నే సొంత పార్టీ నుంచి విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి. మంత్రివ‌ర్గంలో సీటును ఆశించి భంగ ప‌డిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి.. ‘మీరుచేయాల్సింది చేయకుండా.. కేంద్రంపై ఎందుకు విరుచుకుప‌డ‌తారు” అని తీవ్ర వ్యాఖ్య‌లేచేశారు. మ‌రోవైపు.. రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసిన ధ‌ర్నా ఫొటోల‌ను, కేసీఆర్ త‌న హ‌యాంలో ఇందిరా పార్కు వ‌ద్ద చేసిన ధ‌ర్నా ఫొటోల‌ను క‌లిపి.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేసినా.. కొందరు… “నాడు-నేడు తేడాలేదు చూడు!” అని క్యాప్ష‌న్‌తో విమ‌ర్శ‌లు గుప్పించారు.

అప్ప‌ట్లో ధాన్యం కొనుగోలు కోసం.. కేంద్రంపై కేసీఆర్ కొట్లాడుతున్నాన‌ని చెప్పారు. అధికారంలో ఉండి కొట్లాట‌లేంట‌ని.. ఇదే రేవంత్ రెడ్డి అప్ప‌ట్లో ప్ర‌శ్నించారు. కానీ.. రెండేళ్లు తిరిగే స‌రికి సీన్ రివ‌ర్స్ అయిందని అంటున్నారు. బీసీ రిజ‌ర్వేష‌న్ 42 శాతం బిల్లు ను రాష్ట్ర‌ప‌తి ఆమోదించడం లేద‌ని.. దీనికి కేంద్ర‌మే కార‌ణ‌మంటూ.. రేవంత్ ఢిల్లీలో క‌దం తొక్కారు. అయితే.. గ‌తంలో కేసీఆర్‌.. ఇప్పుడు రేవంత్‌ల‌ను కూడా కేంద్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. ఇదిలావుంటే.. అస‌లు రేవంత్ ఆశ‌లు ఏమేర‌కు తీర‌తాయి? అనేది ప్ర‌శ్న‌. మ‌రో నెల ప‌దిహేను రోజుల్లో రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. హైకోర్టు తీర్పు పొంచి ఉన్న నేప‌థ్యంలో దీని నుంచి ఎవ‌రూ త‌ప్పించుకోలేరు.

అయితే.. తాను ప్ర‌తిపాదించిన బీసీ 42 శాతం బిల్లు ఇప్పుడు అమ‌లు చేస్తేనే.. ప్ర‌త్య‌క్షంగా.. త‌మ‌కు ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే.. దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాల నుంచి వ‌చ్చే విమ‌ర్శ ల‌ను దీటుగా ఎదుర్కొనైనా కూడా.. రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేయ‌డం ద్వారా.. కాంగ్రెస్ ఖాతాలో ఈల‌బ్ధిని వేయాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. 10 శాతం మైనార‌టీల‌కు కేటాయిస్తూ.. మ‌రో 42 శాతం బీసీల‌కు ఇవ్వ‌డం ఏంట‌నేది ఇతర సామాజిక వ‌ర్గాల నుంచి వ‌స్తున్న ప్ర‌శ్న‌ల ప‌రంప‌ర‌!. వీట‌న్నింటినీ ఏదో ఒక‌ర‌కంగా అధిగ‌మించాలంటే.. తాము చేసిన బిల్లును త‌క్ష‌ణం ఆమోదించుకుని అమ‌ల్లోకి తీసుకురావ‌డ‌మే క‌ర్త‌వ్య‌మ‌న్నదిసీఎం రేవంత్ రెడ్డి వ్యూహం. అయితే.. ఇదంత హ‌ర్రీబ‌ర్రీగా తేలే విష‌యంగా క‌నిపించ‌డం లేదు. అందుకే ఆశ‌-నిరాశ‌ల మ‌ధ్య రేవంత్ రెడ్డి ప్ర‌యాస ప‌డుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది.