తుస్సుమ‌న్న క‌విత నిర‌స‌న‌.. 72 కాదు.. 7 గంట‌ల్లోనే విర‌మ‌ణ‌!

బీఆర్ ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ కవిత చేప‌ట్టిన 72 గంట‌ల దీక్ష తుస్సు మంది. బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తూ.. రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన బిల్లును త‌క్ష‌ణం ఆమోదింప చేయాల‌న్న ల‌క్ష్యంతో క‌విత కొన్నాళ్లుగా వ్యాఖ్య‌లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తాజాగా సోమ‌వారం 72 గంట‌ల దీక్ష‌కు పిలుపునిచ్చారు. సోమ‌వారం స్వయంగా హైద‌రాబాద్ లోని ధ‌ర్నా చౌక్‌లో నిరాహార దీక్ష‌కు కూర్చున్నారు. అయితే.. ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందీ రాలేదు. కానీ.. 72 గంట‌లన్న దీక్ష‌.. కేవ‌లం ఏడు గంట‌లలోనే ముగిసిపోయింది. ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీసింది.

క‌విత చెప్పిన కార‌ణం ఇదీ..

తాము చేప‌ట్టిన నిరాహార దీక్ష‌కు హైకోర్టు అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని క‌విత చెప్పారు. అందుకే.. కోర్టుల ప‌ట్ల గౌర‌వంతో ఉన్న తాము .. దీక్ష‌ను విర‌మిస్తున్నాని వ్యాఖ్యానించారు. అయితే.. మ‌రోరూపంలో నిర‌స‌న దీక్ష‌లు కొన‌సాగుతాయ‌ని.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య‌మిస్తామ‌ని ఆమె చెప్పారు. చిత్త శుద్ధి ఉంటే.. రాష్ట్ర స‌ర్కారు కేంద్రం ముందు పోరాడాల‌ని.. లేక‌పోతే.. కోర్టుల్లో పోరాటం చేయాల‌ని క‌విత ఉచిత స‌ల‌హాలు ఇచ్చారు. గ‌వ‌ర్న‌ర్‌పై సుప్రీంకోర్టులో కేసు వేయాల‌ని ఆమె సూచించారు. ఆర్డినెన్సు తెచ్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించింద‌న‌డం వేస్ట్ అన్న ఆమె.. ఇవ‌న్నీ బీసీల‌ను మోస‌గించేందుకేన‌ని వ్యాఖ్యానించారు. చిత్త‌శుద్ధి ఉంటే.. వెంట‌నే కోర్టులో కేసు వేయాల‌న్నారు. తమ పోరాటాలు కూడా సాగుతాయ‌ని చెప్పారు.

అస‌లు కార‌ణం ఏంటి?

క‌విత చాలా ఆశ‌లు పెట్టుకుని దీక్ష చేశారు. ఈ 72 గంట‌ల దీక్ష ద్వారా.. జాగృతి నాయ‌కురాలిగా త‌ను గుర్తింపు కోసం ప్ర‌య‌త్నించారు. కానీ, పెద్ద‌గా దీనికి స్పందన రాలేదు. ప్ర‌జ‌లు కూడాపెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఇక‌, జాగృతి త‌ర‌ఫున కూడా కొద్ది మంది మాత్ర‌మే స్పందించారు. చివ‌ర‌కు.. దీక్ష విర‌మించే స‌మ‌యానికి ప‌ట్టుమ‌ని ప‌ది మంది మాత్ర‌మే కార్య‌క‌ర్త‌లు మిగ‌లగా.. పోలీసులు.. భ‌ద్ర‌తా సిబ్బంది 20 మంది ఉన్నారు. అంటే.. కార్య‌క‌ర్త‌ల కంటే కూడా పోలీసులే ఎక్కువ‌గా క‌నిపించారు.

దీంతో ఆమె దీక్ష విర‌మ‌ణ‌కు నిర్ణ‌యం తీసుకున్నార‌న్న చ‌ర్చ రాజ‌కీయాల్లో సాగుతోంది. దీనికి తోడు.. కాళేశ్వ‌రంపై సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌ట‌న‌.. దీనిపై కార్యాచ‌ర‌ణ‌.. వంటివి ఫోక‌స్ కావ‌డంతో క‌విత వెన‌క్కి త‌గ్గార‌న్న చ‌ర్చ కూడా తెరమీదికి వ‌చ్చింది. లేక‌పోతే.. పైకోర్టుకు వెళ్లేందుకు అనుమ‌తి తీసుకుని దీక్ష‌ను కొన‌సాగించేవార‌ని అంటున్నారు. ఏదేమైనా తొలి ప్ర‌య‌త్నంలోనే క‌విత‌కు పెద్ద ప‌రాభ‌వం ఎదురైంద‌న్న వాద‌న బీఆర్ఎస్ వ‌ర్గాల నుంచే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.