జగన్ ప్రభుత్వంలో లాయర్లు మాత్రం హ్యాపీ

అవును మీరు చదివింది నిజమే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఏ వర్గాలు హ్యాపీగా ఉన్నాయనే విషయాన్ని పక్కన పెట్టేస్తే లాయర్లు మాత్రం చాలా హ్యీపీగా ఉన్నారట. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరో ఒకరు ఏదో రూపంలో కేసులు వేయటం దానికి కౌంటర్లుగా ప్రభుత్వం తరపున వాదించటానికి లాయర్లు రెడీ అవటం రెగ్యులర్ అయిపోయింది. మామూలుగా ప్రభుత్వం తరపున వాదించేందుకు అడ్వకేట్ జనరల్, అడిషినల్ అడ్వేకట్ జనరల్ ఎలాగూ ఉంటారు. వీళ్ళు కాకుండా మళ్ళీ లాయర్లతో ఓ ప్యానల్ కూడా ఎటు ఉంటుంది.

రాష్ట్ర హైకోర్టులో వాదించటానికి ప్రభుత్వం తరపున లీగల్ టీం ఉన్నట్లే సుప్రింకోర్టులో వాదించేందుకు కూడా మరో లీగల్ టీం ఉంటుంది. అయితే కారణాలు తెలీటం లేదుకానీ హైకోర్టులో అయినా సుప్రింకోర్టులో అయినా ప్రభుత్వం తరపున వాదించేందుకు ప్రత్యేకంగా ఖరీదైన లాయర్లను రంగంలోకి దింపుతున్నారు. గడచిన ఏడాదినర్నలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ అంశాలపై కొన్ని వందల ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటన్నింటికీ ప్రభుత్వం తరపున లాయర్లు కాకుండా ప్రత్యేకంగా ఖరీదైన లాయర్లు కూడా వాదించారు.

ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం, పంచాయితీ భవనాలకు వైసీపీ రంగులు వేయటం, మూడు రాజధానుల వివాదం, ఇళ్ళ పట్టాల పంపిణీ లాంటి అనేక కేసులు సుప్రింకోర్టులో కూడా వాదనలు జరిగాయి. వీటిన్నింటికి ప్రభుత్వం తరపున లాయర్లకు భారీ ఎత్తున డబ్బులు చెల్లించాల్సొచ్చింది. ప్రభుత్వం ఏ లాయర్ కు చెల్లించే డబ్బయినా ప్రజాధనమే అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇందులో పంచాయితీ భవనాలకు రంగులు లాంటి కొన్ని కేసుల విషయంలో ప్రభుత్వం అనవసరమైన పంతానికి వెళ్ళటం వల్లే కేసు సుప్రింకోర్టు దాకా వెళ్ళింది.

ఈ కేసులన్నీ ఒక ఎత్తయితే స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డతో ప్రభుత్వానికి జరుగుతున్న వివాదం మరోఎత్తు. ప్రభుత్వం, నిమ్మగడ్డ మధ్య ప్రతి చిన్న విషయానికి వివాదం మొదలవ్వటం చివరకు అది హైకోర్టులోనో లేకపోతే సుప్రింకోర్టులోనో వాదనల దాకా వెళుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే లాయర్లకు ప్రభుత్వం చెల్లించిన ఫీజైనా నిమ్మగడ్డ చెల్లించిన ఫీజయినా ప్రజాధనమే అన్న విషయం. ఎవరు కూడా తమ జేబులో నుండి డబ్బులు లాయర్లకు ఫీజులుగా చెల్లించటం లేదు. మొత్తానికి ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని వివాదాలు రేగుతుంటే లాయర్లకు అంత హ్యాపీగా తయారైందన్న మాట.