Political News

సై..! రండి తేల్చుకుందాం: రేవంత్‌-ర‌మేష్‌ల‌కు కేటీఆర్ స‌వాల్‌

బీజేపీ నాయ‌కుడు, ఏపీలోని అన‌కాప‌ల్లి ఎంపీ సీఎం ర‌మేష్ త‌న‌పై చేసిన ఆరోప‌ణ‌ల‌కు బీఆర్ ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తాను చేసిన ఆరోప‌ణ‌ల‌పై నిల‌బ‌డ‌తాన‌ని.. అవి ఆరోప‌ణ‌లు కాదు.. ప‌క్కా వాస్త‌వాల‌ని పేర్కొన్నారు. వీటిపై చ‌ర్చించేందుకు తాను సిద్ధ‌మేన‌న్నారు. “మీకు నిజంగానే తెలుసుకోవాల‌ని ఉంటే.. రండి.. ఒక్కరే కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి, సీఎం ర‌మేష్‌లు ఇద్ద‌రూ క‌లిసి రండి. చ‌ర్చిద్దాం.” అని కేటీఆర్ స‌వాల్ రువ్వారు. తెలంగాణ‌ను అడ్డు పెట్టుకుని దోచుకునేందుకు ప్ర‌య‌త్నించిన రేవంత్ రెడ్డికి.. ర‌మేష్ స‌హ‌క‌రించార‌ని మ‌రోసారి ఆయ‌న ఆరోపించారు.

ఈ దోపిడీకి స‌హ‌క‌రించినందుకే.. ర‌మేష్‌కు రూ.1660 కోట్ల రోడ్డు కాంట్రాక్టు ప‌నుల‌ను అప్ప‌నంగా అప్ప‌గించార‌ని కేటీఆర్ దుయ్యబ‌ట్టారు. అస‌లు ఫ్యూచ‌ర్ సిటీనే లేన‌ప్పుడు అక్క‌డ రోడ్డు వేసేందుకు కాంట్రాక్టు ఎలా ఇచ్చారో అర్ధం కావ‌డం లేదా? అని ప్ర‌శ్నించారు. అదేవిధంగా హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూముల విష‌యంలోనూ 10 వేల కోట్ల కుంభ‌కోణం జ‌రిగింద‌ని.. ఈ విష‌యాన్నే తాను ప్ర‌స్తావించాన‌న్నారు. ఈ రెండు అంశాల‌పైనా చ‌ర్చ‌కు రెడీ కావాల‌ని.. తాను ఎక్క‌డికి ర‌మ్మంటే అక్క‌డ‌కు వ‌స్తాన‌ని కేటీఆర్ తేల్చి చెప్పారు. లుచ్చా ప‌నులు చేయ‌డం.. అల‌వాటుగా మారిందని, ప్ర‌శ్నిస్తే.. ఎదురు దాడి చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

ఇక‌, బీఆర్ ఎస్ విలీనంపై సీఎంర‌మేష్ చేసిన వ్యాఖ్య‌ల‌ను కూడా కేటీఆర్ తిప్పి కొట్టారు. “బీఆర్ ఎస్ పార్టీ ఎప్పుడు ఇబ్బందుల్లో ప‌డినా.. కాంగ్రెస్‌, బీజేపీలు.. ప‌నికిమాలిన‌, ప‌స‌లేని.. విల‌న ప్ర‌తిపాద‌న‌ను తెర‌మీదికి తెస్తున్నాయి. అస‌లు తెలంగాణ కోసం.. ఇక్క‌డి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు.. తెలంగాణ అస్తిత్వాన్ని నిల‌బెట్టేందుకు పుట్టిన పార్టీగా బీఆర్ ఎస్‌కు విలీనం కావాల్సిన అవ‌స‌రం కానీ.. ఆ అగ‌త్యం కానీ లేవు. కానీ.. మాకు ఇబ్బందులు వ‌చ్చిన ప్ర‌తిసారీ.. విలీనం.. విలీనం.. అంటూ ప‌నికిమాలిన రాజ‌కీయాలు చేస్తున్నారు.” అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. బీఆర్ ఎస్ ఇప్పుడే కాదు.. ఎప్ప‌టికీ.. ఇత‌ర పార్టీల్లో చేరే ప్ర‌స‌క్తే లేద‌ని.. విలీనం అంత‌క‌న్నా లేద‌ని తేల్చి చెప్పారు.

ఏంటి వివాదం?

ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ సీఎం ర‌మేష్‌.. తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో చేతులు క‌లిపి.. రుణాలు ఇప్పించార‌ని.. దీనికి ప్ర‌తిఫ‌లంగా రేవంత్ రెడ్డి 1660 కోట్ల రూపాయ‌ల విలువైన కాంట్రాక్టును ఎలాంటి టెండ‌ర్లులేకుండానే అప్ప‌నంగా ర‌మేష్ సంస్థ‌కు క‌ట్ట‌బెట్టార‌ని.. కేటీఆర్ కొన్ని రోజుల కింద‌ట సోష‌ల్ మీడియాలో వ్యాఖ్యానించారు. దీనిపై సీఎం ర‌మేష్ శ‌నివారం సాయంత్రం స్పందించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల్లో ప‌స‌లేద‌న్నారు. అస‌లు అంత పెద్ద కాంట్రాక్టును నామినేష‌న్ విధానంలో ఎలా అప్ప‌గిస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ క్ర‌మంలోనే క‌విత జైల్లో ఉన్న‌ప్పుడు.. త‌న ఇంటికి వ‌చ్చిన కేటీఆర్‌.. బీఆర్ ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తామ‌ని.. కేసుల నుంచి త‌మ‌ను బ‌య‌ట‌ప‌డేయాల‌ని ప్రాథేయ ప‌డ్డార‌ని చెప్పారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ త‌న‌వ‌ద్ద ఉంద‌న్నారు. దీనిపైనే కేటీఆర్ స‌వాల్ రువ్వారు.

This post was last modified on July 27, 2025 2:06 pm

Share

Recent Posts

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

15 minutes ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

28 minutes ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

37 minutes ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

1 hour ago

దేశం కోసం కష్టపడే ప్రధాని మోదీపై విమర్శలా

జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…

2 hours ago

మోదీని యువత తిడుతుంటే పవన్ కంట్లో నీళ్లు తిరిగాయి

బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…

3 hours ago